
విజయవాడ, జూన్ 19,
తెలుగు రాష్ట్రాల్లో( నియోజకవర్గాల సంఖ్య పెరగనుందా? పునర్విభజన కచ్చితంగా చేపడతారా? కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జన గణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ప్రచారం సాగుతోంది. జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. తద్వారా నియోజకవర్గాల పెంపు, రిజర్వేషన్ల కేటాయింపునకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తరువాత పునర్విభజన ప్రక్రియ చేపట్టి 2029 ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.రాష్ట్ర విభజనజరిగి 11 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికే 2014, 2019, 2024 ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంతా భావించారు. విభజన హామీల్లో సైతం నియోజకవర్గాల పెంపు విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. కానీ జన గణన, కుల గణన జరగకపోవడంతో దానిపై ముందడుగు వేయలేకపోయింది కేంద్రం. వాస్తవానికి 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన 2021లో చేపట్టాల్సిన జనగణన.. కరోనా వైరస్ కారణంగా చేపట్ట లేకపోయారు. దేశంలో వచ్చే ఏడాది రెండు విడతల్లో జనగణన చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.పునర్విభజనలో భాగంగా ఏపీలో అసెంబ్లీ సీట్లు50 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంట్ స్థానాలు కొనసాగుతున్నాయి. ప్రతి పార్లమెంటు స్థానంలో రెండు నియోజకవర్గాల చొప్పున పెరిగే అవకాశం ఉంది. ఈ పునర్విభజన పైనే చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా అధికార పార్టీకి పునర్విభజన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. తమకు అనుకూలంగా పునర్విభజన చేపట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో కూటమి పార్టీల నేతలు ఎక్కువగా పునర్విభజన పై ఆశలు పెట్టుకున్నారు. 50 అసెంబ్లీ సీట్లు పెరిగితే.. ఆశావహులకు సైతం చాలా సులువుగా సీట్లు కేటాయించవచ్చని పార్టీలు భావిస్తున్నాయి.చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉండేది. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. 2009లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించడం వెనుక పునర్విభజన ప్రక్రియ దోహద పడిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడం, కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో తప్పకుండా కూటమికి అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అయితే 2027 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.