YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బనకచర్ల చుట్టూ రాజకీయం

బనకచర్ల చుట్టూ రాజకీయం

తిరుపతి, జూన్ 19,
బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జల భద్రతను ఇచ్చే కవచంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణిస్తుంటే, తెలంగాణకు ఈ ప్రాజెక్టు శాపమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.గోదావరి నదిలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఎంసీల వరద కలుస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ మూడు వేల టీఎంసీలలో 200 టీఎంసీల వరద నీటిని కరవు పీడిత ప్రాంతం రాయలసీమతోపాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించడం ప్రాజెక్టు లక్ష్యం. ఇది కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతోపాటు ఏపీకి తాగునీటి కొరత తీర్చేందుకు ఉద్దేశించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దాదాపు 80 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయ పరంగా చూస్తే సుమారు 7.5 లక్షల నుండి 12 లక్షల ఎకరాల వరకు కొత్తగా సాగు నీరు అందించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది రాయలసీమకు వరప్రదాయినిగా చెప్పవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు ఈ ప్రాంతంలో గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న 22.59 లక్షల ఎకరాల ఆయకట్టును సాగునీటిని స్థిరీకరించవచ్చు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు, నాగార్జునసాగర్ కుడి కాలువ కింద 8 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణకు ఈ బనకచర్ల ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. ఇది పారిశ్రామిక అవసరాలను తీర్చే ప్రాజెక్టు కూడా. కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ఇది దోహదం చేస్తుంది.
సెంట్రల్ వాటర్ కమిషన్‌కు బనకచర్ల ప్రాజెక్టుపై "ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ " ను ఏపీ ప్రభుత్వం 2025, మే 22న సమర్పించింది. దీనిపై కేంద్ర జల సంఘం దృష్టి సారించింది. దీనిపై డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను సమర్పించడానికి ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు కీలకమైనవి. ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ నిపుణుల అంచనా కమిటీ జూన్ 17, 2025న సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం - పర్యావరణ ప్రభావంపై ప్రాధమికంగా చర్చించింది. ఈ ప్రాజెక్టుకు  మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అంతే కాకుండా, ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం జలహారతి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు అనేది గోదావరి-కృష్ణా-పెన్న నదులను అనుసంధానం చేసే ప్రణాళిక. గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం ముఖ్య లక్ష్యం. మూడు దశలుగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. పోలవరం నుండి కృష్ణా నది వరకు తొలి దశగా, కృష్ణా నది నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెండో దశగా, బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు మూడో దశగా నిర్మాణాన్ని చేపట్టేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇలా గోదావరి వరద జలాలను గోదావరి బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు తరలించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో వినియోగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.బనకచర్ల కరువు పీడిత రాయలసీమకు పునరుజ్జీవం కల్పించే ప్రాజెక్టు. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో జలవనరులు మరింత పెరుగుతాయి. తద్వారా కలిగే నీటి సమృద్ధి వల్ల వ్యవసాయ రంగంలో ఏపీ విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించే వీలుంటుంది. ఏపీ స్థూల దేశీయోత్పత్తి  పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. వలసలు తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నీటిని వినియోగించనున్నారు. తద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మొత్తం మీద ఏపీ సమగ్రాభివృద్ధికి బనకచర్ల ప్రాజెక్టు కీలకం అని చెప్పాలి

Related Posts