YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖకు ఇంటర్నేషనల్ బ్రాండ్...

విశాఖకు ఇంటర్నేషనల్ బ్రాండ్...

విశాఖపట్టణం, జూన్ 19, 
అంతర్జాతీయ స్థాయిలో మరోసారి విశాఖపట్నం మార్మోగ నుంది. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐదు లక్షల మందితో యోగా దినోత్సవ వేడుకలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖ సిటీ పర్యాటకంగా గుర్తింపు పొందింది. వాణిజ్యపరంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగాసిటీగా గుర్తింపు సాధించింది. అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ గా పేర్కొంటారు. ఇక టూరిజం అంటే విశాఖ అని అంతర్జాతీయ పర్యాటకులు భావిస్తారు. అటువంటి చోట ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరుపుతుండడంతో.. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విశాఖ చర్చకు దారితీస్తోంది.యోగాకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చింది భారత్. అందుకే యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి విశాఖలో జరిగే వేడుకలకు హాజరవుతానని ముందుగానే ప్రకటించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మోడీ.. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సాగర తీరానికి వస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే విశాఖ అభివృద్ధికి అడుగులు పడినట్టే. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతున్న క్రమంలో ఇటువంటి అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలవడం శుభపరిణామం.ప్రధాని విశాఖ పర్యటనక సంబంధించి షెడ్యూల్ ముందుగానే ఖరారు అయింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తరువాత రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖ బీచ్ రోడ్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అదేరోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖకు ప్రముఖుల తాకిడి పెరిగింది. ఇప్పటికే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆయన ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ నేరుగా విశాఖకు చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఒకరోజు ముందుగానే విశాఖ నగరం భద్రత వలయంలోకి వెళ్తుంది. ఇప్పటికే నగరం నిఘా నీడలో ఉంది. మొత్తానికైతే విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి రావడం పై నగరవాసులతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts