
నెల్లూరు, జూన్ 19,
ఏపీలోతల్లికి వందనం పథకం సందడి నెలకొంది. బ్యాంకులు రద్దీగా మారుతున్నాయి. ఇంకోవైపు వస్తువుల కొనుగోలుతో మార్కెట్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 12న విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. అదే రోజు తల్లికి వందనం నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తల్లుల ఖాతాలలో నిధులు జమ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. అయితే డబ్బులు ఖాతాలలో పడని వారు లబో దీపం అంటున్నారు. తమనెందుకు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారంటూ గ్రామ సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అయితే మీరంతా నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించారని చెబుతుండడంతో షాక్ కు గురవుతున్నారు. అయితే తాము అంత విద్యుత్ వాడలేదని వారు చెబుతున్నారు. అటు నుంచి అటే విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. అయితే అనర్హుల జాబితాలో ప్రతి మండలం నుంచి వేలాదిగా ఉండడంతో వారు మండల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖాతాలో సొమ్ము పడినవారు సంతోషంగా ఉన్నారు. పడని వారు మాత్రం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా స్థానిక సచివాలయాల్లో ఆరా తీస్తున్నారు. విద్యుత్ వినియోగం అధికం గా ఉందన్న సమాధానం రావడంతో మండల విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్తున్నారు. తమ కరెంట్ బిల్లు తక్కువగా వచ్చినా.. ఎందుకు ఎక్కువగా చూపారంటూ నిలదీస్తున్నారు. తాము వాడిన విద్యుత్ వినియోగానికి సంబంధించి స్టేట్మెంట్ కోరుతున్నారు. అయితే అది తమ చేతిలో లేదని.. కేవలం 6 నెలలు మాత్రమే స్టేట్ మెంట్ ఇవ్వగలమని తేల్చి చెబుతున్నారు. అయితే సచివాలయ సిబ్బంది మాత్రం 12 నెలల స్టేట్మెంట్ అడుగుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది ఈ కారణంతోనే తల్లికి వందనం పథకానికి దూరం కావడంతో.. ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సచివాలయాల్లో ఫిర్యాదుల విభాగానికి వినతులు ఇచ్చుకోవాలని సూచించింది.ఈనెల 20 వరకు ఫిర్యాదు చేసుకోవచ్చు. 21 నుంచి 28 వరకు ఫిర్యాదులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారు. అప్పుడు అర్హత సాధిస్తే అర్హుల జాబితాలో పేరు చేర్చుతారు. ఈనెల 30న సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 5న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం, ప్రతిపక్షాలకు ఇది ప్రచార అస్త్రంగా మారడం, గతంలో వైసిపి ఇదే నిబంధనను తెరపైకి తేగా అప్పట్లో వ్యతిరేకించడం… వంటి కారణాలతో ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగానికి సంబంధించి అనర్హులను అర్హులుగా తేల్చి.. వారి ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఫిర్యాదులను పక్కన పెట్టాలని.. వారందరి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని సచివాలయాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.