YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్ణీత స‌మ‌యానికి ముందే మిష‌న్ భ‌గీర‌థ‌ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

నిర్ణీత స‌మ‌యానికి ముందే మిష‌న్ భ‌గీర‌థ‌             వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి
నిర్ణీత స‌మ‌యానికంటే ముందే మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం పూర్త‌వుతుంద‌ని, త‌ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ న‌ల్లాల ద్వారా స్వ‌చ్ఛ‌మైన భూ ఉప‌రిత‌ల‌ మంచినీటిని అందించే బృహ‌త్త‌ర భ‌గీర‌థ ప‌థ‌కం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తుంద‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని రంగ‌నాయకుల గుట్ట మీద ఏర్పాటు చేసిన ట్యాంకు ద్వారా మిష‌న్ భ‌గీర‌థ నీటిని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో మిష‌న్ భ‌గీర‌థ మంచినీటి ప‌థ‌కం నిర్ణీత స‌మ‌యానికంటే ముందే పూర్త‌వుతున్న‌ద‌న్నారు. సీఎం కెసిఆర్ సంక‌ల్పానికి మొత్తం మంత్రి వ‌ర్గం, ఎమ్మెల్యేలు, అధికారులు అంతా క‌లిసి సాధించిన ఘ‌న‌త‌గా మంత్రి చెప్పారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు చాలా స‌మ‌యం తీసుకుంటాయ‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి ప్రాజెక్టుల‌ను గ‌త ప్ర‌భుత్వాలు క‌నీసం ఊహించ‌లేద‌న్నారు. సిఎం కెసిఆర్ పంచాయ‌తీరాజ్‌, ఆర్‌డ‌బ్ల్యుఎస్‌, అటవీ, రైల్వే వంటి అనేక‌శాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మిష‌న్ భగీర‌థ పైపులు వేసి, నీటిని అందించ‌డం రికార్డు అన్నారు.భూ ఉప‌రిత‌ల మంచినీటిని ఆరోగ్య జ‌లంగా పేర్కొన‌వ‌చ్చ‌ని, ఇలాంటి నీటిని తాగితే, ఎలాంటి జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని చెప్పారు. స్వ‌చ్ఛ‌మైన, ఆరోగ్య జ‌లం అంద‌క‌పోవ‌డం వ‌ల్లే అనేక మంది కిడ్నీ వంటి వ్యాధుల బారిన ప‌డుతున్నార‌ని మంత్రి చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంతో ఆరోగ్య తెలంగాణ‌కు బాట‌లు ప‌డ‌తాయ‌న్నారు. రోగాలు వ‌చ్చాక చేసే వైద్యం కంటే రోగాలు రాకుండా చూసే వీలున్న ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ అన్నారు. అలాగే హ‌రిత హారం, మిష‌న్ కాక‌తీయ వంటి ప‌లు ప‌థ‌కాలు కూడా ఆరోగ్య‌దాయ‌క‌మైన ప‌థ‌కాల‌న్నారు. ఇలాంటి ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌లు ఆయురారోగ్యంగా ఉంటార‌ని చెప్పారు.ప్ర‌స్తుతం జ‌డ్చ‌ర్ల‌లో ప్రారంభించిన మంచినీటి ట్యాంకుతో మొత్తం 360గ్రామాల‌కు ఇంటింటికీ న‌ల్లా నీళ్ళు అందుతాయ‌ని మంత్రి తెలిపారు. ఆగ‌స్టు ఆఖ‌రు నాటికి ఇంటింటికీ న‌ల్లా నీరు పూర్తి స్థాయిలో అందుతాయ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికీ నీరు అందుతుంద‌న్నారు. ఆడ‌వాళ్ళు ఇక బిందెలు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం రాద‌న్నారు. ఇంద‌కు స‌హ‌క‌రించి, ప‌ని చేసిన అధికారుల‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి అభినందించారు. అంత‌కుముందు మంత్రి రంగ‌నాయకుల దేవాల‌యాన్ని సంద‌ర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. 

Related Posts