బిజెపి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేలా బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటన సాగిందని అఖిల భారత కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ జీ తెలిపారు. పార్టీ శ్రేణులతో అమిత్ షా సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శులు జీ ప్రేమేందర్రెడ్డి,చింత సాంబమూర్తి తో కలిసి మీడియాతో మాట్లాడారు. బిజెపి సొంత బలంతోనే రాబోవు ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. వచ్చే ఎన్నికల లోపే రామ మందిర నిర్మాణం చేపట్టేలా చర్యలు ఉంటాయని అమిత్ షా సూచాయంగా తెలిపారని ఆయన చెప్పారు. మండల, గ్రామస్థాయిలో పార్టీ నాయకత్వం పర్యటించేలా, ప్రజలతో మమేకమై పల్లెపల్లెలో బిజెపిని విస్తృతం చేయాలని అమిత్ షా నిర్దేశించినట్లు శేఖర్ జీ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో 119 నాయకత్వ బృందాలు పర్యటించేలా కార్యచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు శేఖర్ జీ చెప్పారు.కేంద్ర పథకాలు ప్రజలకు వివరించడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనపై బిజెపి మున్ముందు వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం చింతా సాంబమూర్తి మాట్లాడుతూ2019 ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర బిజెపి శ్రేణులకు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మార్గనిర్దేశం చేశారని, తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ఎదిగేందుకు అమిత్ షా పర్యటన తోడ్పడుతోందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, భ్రష్టాచారాలపై పోరాటాలకు సిద్ధం కావాలని అమిత్ షా పిలుపునిచ్చారని, అలాగే తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాల కుట్రలు, కుయుక్తులను పటాపంచలు చేసేలా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా సూచించినట్లు ఆయన చెప్పారు.అనంతరం.... పార్టీ ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ... 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపిని బలోపేతం చేసేలా ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లను, ఎన్నికల్లో కృషి చేసే వారిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించారన్నారు. రాష్ట్రంలో ఒంటెద్దు పోకడలతో నియంతృత్వ పాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని అమిత్ షా స్పష్టం చేసినట్లు ప్రేమేందర్రెడ్డి తెలిపారు. కుటుంబ పాలన, నియంతృత్వ పాలనపై గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు చేయాలని అమిత్ షా చెప్పినట్లు ఆయన తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారని, 2019 ఎన్నికల నాటికి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మనోహర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర మీడియా కన్వీనర్ వి సుధాకర్శర్మ, తదితరులు పాల్గొన్నారు.
జైన చైతన్య యాత్ర పుస్తకావిష్కరణ
అమిత్ షా పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జన చైతన్య యాత్ర పుస్తకాన్ని జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరించారు. జూన్ 23 నుంచి జులై 6 వరకు 14 రోజుల పాటు మార్పు కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ చేపట్టిన జన చైతన్య యాత్ర పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. తొలిరోజు భువనగిరిలో ప్రారంభమైన యాత్ర.. చివరి రోజు తుంగతుర్తిలో ముగిసిన వివరాలను ఈ జనచైతన్య యాత్ర పుస్తకంలో వివరాణాత్మకంగ పొందుపరిచారు. 14 రోజుల పాటు, 14 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో, అలాగే 48 నియోజకవర్గాల్లో 206 మండలాల్లో యాత్ర కొనసాగిన తీరును ఈ పుస్తకంలో పొందుపరిచారు. యాత్ర మొత్తంలో నిర్వహించిన 26 సభలు, 48 ర్యాలీల గురించి సైతం ఈ పుస్తకంలో సవివరణాత్మకంగా పొందుపరిచారు.