టీ-శాట్ అనేది విద్య, వ్యవసాయమే కాకుండా ఇతర రంగాలకూ విస్తరించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీ-శాట్ బృందాన్ని కోరారు. అవసరమైతే జిల్లాల వారీగా కలెక్టర్లు, మంత్రులు ముందుకొస్తారని తెలిపారు. టీ-శాట్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్లోని టీ-శాట్ కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్.. సీఈవో శైలేష్ రెడ్డితో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం టీ-శాట్ అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి చేరువైనప్పుడే ప్రభుత్వాలకు నిజమైన విజయమని పేర్కొన్నారు. అనంతరం టీ-శాట్ ఉద్యోగులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు.