తెలంగాణలో శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తోంది ప్రభుత్వం. భద్రతలో ఎక్కడా రాజీపడకుండా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యలు ముమ్మరంచేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీస్స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలోని అన్ని మండలాల్లోనూ ఈ తరహా ఠాణాలు నిర్మిస్తామని రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ ఇటీవలే స్పష్టంచేశారు. దీనికోసం భారీగానే నిధులు కేటాయించినట్లు వివరించారు. రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో అంతర్గాం, రామగిరి, కన్నెపల్లి, బీమారంలో ఒక్కో పోలీసుస్టేషన్ భవన నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. ఇక సిరిసిల్ల జిల్లాలో రూ. 50 కోట్లతో పోలీసు బెటాలియన్తోపాటు 13 కొత్త జిల్లాలలో రామగుండం, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక దసరా సమయానికి కామారెడ్డి పోలీసు భవనం ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రామగుండంలో రూ. 4.50 కోట్లలో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మిస్తున్నారు. గోదావరిఖని విషయానికి వస్తే ఈ ప్రాంతంలో రూ. 5 కోట్లలో పోలీసు అతిథి గృహానికి సంబంధించి భూమి పూజ జరిగింది. కొత్తగా ధర్మపురిలో విశ్రాంతిభవనం, భక్తుల కోసం హాల్ నిర్మించనున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను పటిష్ట పరచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే దేశ చరిత్రలో పోలీసు స్టేషన్ల నిర్వహణకు నెలనెలా రూ.25 వేల నుంచి రూ. 75 వేలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.