తెలంగాణ రాష్ట్ర సమితిని మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రతిపక్షాలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ, సీపీఐలు కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాయి. దాదాపు రెండు నెలల క్రితమే పొత్తు ఖరారయినప్పటికీ ఇప్పటి వరకూ సీట్ల సర్ధుబాటు వ్యవహారం కొలిక్కిరాలేదు. అసలు తమకు టికెట్ దక్కుతుందో లేదో తెలియక కూటమిలోని పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. కొందరేమో తమకే టికెట్ వస్తుందంటూ పోటీ పోటీగా ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. దీంతో కొన్ని చోట్ల పరిస్థితి చేయి దాటే వరకూ వెళ్లింది. ఇలాంటి చోట్ల ఆయా పార్టీల అధిష్ఠానాలు చెప్పినా అక్కడి నేతలు పెడచెవిన పెడుతున్నారు. సీట్ల సర్ధుబాటు ఆలస్యం అవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ప్రాసెస్ను వేగవంతం చేసింది. కూటమిలోని పార్టీల అధినేతలతో, పార్టీ నాయకులతో మాట్లాడి ఒక అంచనాకు వచ్చేసింది. కొద్దిరోజుల్లో సీట్ల సర్ధుబాటు కూడా పూర్తయిపోతుంది. ఇలాంటి సందర్భంలో కూటమిలోని ఓ పార్టికి చెందిన నేత ప్రకటనతో చిచ్చు రేగింది. తెలంగాణ జనసమితికి చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి స్థానాన్ని మహాకూటమి తమ పార్టీకి కేటాయించిందని, తానే అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. అంతేకాదు, ఆదివారం నుంచి ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. అలాగే, కూటమిలోని ఉమ్మడి పార్టీలను సంప్రదించిన తర్వాతే ప్రకటిస్తున్నానని, అధికారికంగా మరో రెండ్రోజుల్లో మహాకూటమి ప్రకటన చేస్తుందని చెప్పారు. ఈయన ప్రకటనతో ఆ స్థానంలోని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. దీంతో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తూ అటు అధిష్ఠానం చుట్టూ ఇటు గాడ్పాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఏఐసీసీ ఓబీసీ జాతీయ కో-ఆర్టినేటర్ బోనగిరి సురేష్ యాదవ్ ఆదివారం గాంధీభవన్ వద్ద తన మద్దతుదారులతో కలిసి ఆందోళనను దిగారు. 1958 నుంచి మల్కాజిగిరి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీని ఉందని దానిని టీజేఎస్కు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు గనుక టీజెఎస్కు వెళ్తే ఓడిపోవడంతో పాటు భవిష్యత్తులో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధినాయకత్వానికి వివరించారు. కూటమిలో ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి.