తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ఎంతగానో కృషి చేస్తున్నదని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు షీ టీం లతో పాటు పలు చట్టాలను రూపొందించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో మహిళల భద్రత - మనందరి బాధ్యత పేరిట రూపొందించిన పుస్తకాన్ని శనివారం నాంపల్లి గగన్ విహార్ లోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో సుజాత యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న గృహ హింస చట్టాలపై, బాలబాలికలను కాపాడుకునే అంశాలు, పిల్లలకు అందించాల్సిన న్యూట్రీషన్ ఆహార పదార్థాల సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. మహిళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మహిళల భద్రతకు ప్రభుత్వం సైతం ఎనలేని కృషి చేస్తున్నదని అన్నారు. ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ సుభిక్ష వాతావరణం చోటుచేసుకుంటుందని చెప్పారు. మహిళలకు సంబంధించిన అన్ని చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. పుస్తకావిష్కరణలో కార్యదర్శి జయశ్రీ, బోర్డు అధికారులు సత్యనారాయణ, వకులాదేవి, కిరణ్, సురేష్, సువర్ణ, నర్సింహా తదితరులు ఉన్నారు.