రైతాంగానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని, అలాగే ఐకేపి, పిఏసిసిఎస్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పిసిసి పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో, డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో సోమవారం జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో రైతు ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతులు, నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో బైపాస్ రోడ్డు గుండా వాహనాలను పోలీసులు దారిమళ్లించారు. ధర్నానుద్దేశించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తన అక్రమ సంపాదన కాపాడుకోవడానికి రైతుల జీవితాలను కేంద్రానికి తాకట్టుపెట్టారని ఆరోపించారు. అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు మడ్దతు ధర కల్పించి భరోసా ఇవ్వగా నేడు నష్టం పేరుతో
గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసే ప్రయత్నం చేస్తే టిఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరుగే పరిస్థితిలేదని హెచ్చరించారు.
రైతువ్యతిరేక చట్టాలను ఉపసంహరించకుంటే రైతుల ఉసురు తగిలి ప్రభుత్వాలు కూలిపోతాయని జ్యోష్యం చెప్పారు.
బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని,రాజ్యాంగ మౌళిక సూత్రాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవసాయ చట్టాలను రైతులపై రుద్దడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బందులో పాల్గొన్న టీఆరెస్ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
రైతుల వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధర, కొనుగోలు చేసేందుకుగాను 1965 లో అప్పటి ప్రధాని నెహ్రు భారత ఆహార సంస్థను ఏర్పాటుచేసి రైతులకు భరోసా కల్పించారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన నిలిచిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ సి ఐ ని ప్రయివేటీకరణ చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తో పాటు పసుపుకు 15 వేల మద్దతు కల్పనకు కృషి చేయాలని సూచిస్తూ,
అప్పటి ఎంపీ కవిత చేసిన విధంగానే గాలి మాటలు చెప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజామాబాదు ఎంపీ అరవిందు అమలుచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం లో ఖాయిలా పడ్డ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభించాలని,జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతు వ్యతిరేక నల్లచట్టాలను ఉపసంహరించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించని నల్ల చట్టాలు ఎందుకని ప్రశ్నించారు.
వరి కొనుగోలు కేంద్రాలతో 7వేల కొట్లు నష్టం వచిందని చెబుతున్న కేసీఆర్ ఇది ప్రభుత్వమా, వ్యాపార సంస్థానా అని ప్రశ్నించారు. ఈ విషయంలో క్వింటాలుకు 20 రూపాయల భారం మోయలేక పోవడం ఆచర్యంగా ఉందన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే కెసిఆర్ కు సిఎం పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీకీ పొర్లు దండాలు పెట్టిన కేసీఆర్ ను వదిలి పెట్టమని, జైల్లో పెడుతామని చెబుతున్న బిజెపి నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలు, ఫామ్ హౌస్ లో వేల కోట్ల అక్రమసంపాదన ఉందని చెప్పి ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని రెండు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని రైతుల ఉసురు తగిలిన ఎవరు మనుగడ సాగించలేరని చెప్పారు.
కార్యక్రమంలో జగిత్యాల డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు, కృష్ణా రావు, మేడిపల్లి సత్యం, బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, గిరి నాగభూషణం, దేవేందర్ రెడ్డి, మసర్థి రమేష్, సర్పంచ్ లు తాటిపర్తి శోభారాణి, ముస్కు నిశాంత్ రెడ్డి, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, నక్క జీవన్, బండ భాస్కర్ రెడ్డి, గుంటి జగదీశ్వర్, గజ్జెల స్వామి, మధుకర్ రెడ్డి, తాండ్ర సురేందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా మధు, బాపు రెడ్డి, పరీక్షిత్ రెడ్డి, నరేష్, గంగాధర్, నేహాల్ ,నదీమ్ ,రియాజ్ ,కమల్ ,రాజేష్ , పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎద్లబండిలో ఉన్న జీవన్ రెడ్డి కీ రైతులు నాగలి బహుకరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.