
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక నియామక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నియామక ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, పరీక్షల నిర్వహణను తిరిగి సొసైటీల పరిధిలోకి తీసుకురానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ప్రత్యేక నియామక బోర్డును పరిశీలిస్తోంది. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం టీఎస్ఆర్ఈఐఆర్బీని ఏర్పాటు చేస్తోంది. బోర్డుకు కన్వీనర్గా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్కుమార్ పేరును ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. బోర్డు ఏర్పాటు ఫైలుకు సీఎం ఇప్పటికే ఆమోదముద్ర వేశారని, స్వల్ప మార్పులు చేసి 3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.
ప్రశ్నపత్రాల తయారీ, సిలబస్ తదితర అంశాలపై జేఎన్టీయూహెచ్కు బాధ్యతలు అప్పగించాలని ప్రభు త్వం భావిస్తోంది. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మెజారిటీ అధికారులు జేఎన్టీయూహెచ్కు ఇవ్వాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించాక ఆయన నిర్ణయం ఆధారంగా ఖరారు చేసే అవకాశముంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించాలంటే దాదాపు 5 వేల ఖాళీలను భర్తీ చేయాలి. బోరాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలో.. గురుకులాల నియామకానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, నియామకాలు చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన దస్త్రాన్ని సీఎం కార్యాలయం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం లభిస్తే గురుకుల నియామకాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఏదైనా యూనివర్శిటీకి అప్పగించాలని సొసైటీలు భావిస్తున్నాయి. గురుకులాల సొసైటీల పరిధిలో నియామకాలన్నీ గతంలో ఆయా సొసైటీలు నిర్వహించేవి. తొలుత కాంట్రాక్టు విధానంలో తీసుకుని, రెండేళ్ల తరువాత సర్వీసు క్రమబద్ధీకరించేవారు. కేజీ టూ పీజీ విద్యలో భాగంగా తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో గురుకులాల సంఖ్యను ప్రభుత్వం భారీగా పెంచింది. ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల నియామకాన్ని టీఎస్పీఎస్సీ పరిధిలోకి తీసుకువచ్చింది. తాజాగా ప్రత్యేక బోర్డు ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఇటీవల ఆర్థికశాఖ మరికొన్ని గురుకుల పోస్టులకు ఆమోదం తెలిపింది. ఆయా పోస్టుల నియామక బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగించింది. టీఎస్పీఎస్సీ నియామకాలు చేయడంతో ప్రక్రియ ఆలస్యమవుతోందని, తిరిగి సొసైటీలకే బాధ్యత అప్పగించాలని సీఎంవోవర్గాలు ప్రతిపాదించాయి