YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సంగమేశ్వర దేవాలయం.

సంగమేశ్వర దేవాలయం.

సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.
చరిత్ర
క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్ర నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మీంచారు. ప్రస్తుతం బాదామి, కర్ణాటక లోని చాగల్ కోట జిల్లాలో ఉంది. నిర్మాణాలకవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలంచే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారి కొక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది.
కూడలి సంగమేశ్వరాలయం
దక్షిణాపథంలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన మొదటిరాజ్యం బాదామి చాళుక్యులది. ఈ వంశంనుండే అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడినాయి. కర్ణాటకలో కళ్యాణి, అంధ్ర ప్రదేశ్ లో వేంగి, వేములవాడ, ఎలమంచిలి, ముదిగొండ మొదలగునవి. బాదామి చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీరు మాత్రం వైదిక మతాన్ని అవలంబించారు. వీరి తొలి రాజ ధాని ఐహోల్ లోను, తరువాతి కాలం నాటి రాజధాని బాదామిలో ఎన్నో ఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్నిబౌద్ధ, జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి. వీరు కృష్ణానది ఉపనది మలప్రభా నది ఉత్తర వాహినిగా ఉన్న పట్టాడకల్ లో పట్టాభిషేకాలు జరుపుకునే వారు, అక్కడ పాపనాధ గులగనాథ, సంగమేశ్వర మొదలైన ఆలయాలను నిర్మించారు. వీరికి పల్లవులతో నిరంతర యుద్ధాలు జరిగేవి. విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచి లోని కైలాశనాధ అలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్లో నిర్మించారు. వీరి రాజ్యంలో మలప్రభ కృష్ణతో సంగమించే 'కూడలి' లో సంగమేశ్వరాలయం నిర్మించారు. ఇక్కడే కొన్ని శతాబ్దాల తర్వాత తొలి కన్నడ కవి, సంస్కర్త, వీరశైవ మత స్థాపకుడు, బసవన్న సమాధి అయ్యాడు. రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మొలక సీమ లేక ఏరువసీమ లేక రెండేరుల నడిమి సీమగా పిలవబడే ప్రస్తుత మాహబూబ్ నగర్ - కర్నూలు జిల్లా ల్లోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈ సీమలో తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలయాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా? అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి, విగ్రహాలు, గంగ, యమున, అర్ధనారీశ్వర, హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ అవస్థలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చర్యాన్ని గొల్పుతుంది.
కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కానీ వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం వుండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం వుండటం వల్ల ఇక్కడ నవ బ్రహ్మాలయాల సముదాయాన్ని నిర్మించారు. అవి పట్టాడకల్ లోని గలగనాధ, పాపనాధ, ఆలయాలను పోలి వుంటాయి. కాలక్రమాన చాళుక్యుల ప్రాభవం తగ్గ సాగింది. రాష్ట్రకూటుల ప్రాభవం పెరిగింది. వీరు పల్లవులతో సంబంధ బాంధవ్యాలు నెరపి చాళుక్యులను జయించారు. ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరాలో కొండను తొలిచి కైలాశనాధాలయాన్ని నిర్మించారు. ఇక మొలక సీమ వైపు చూస్తే 'నివృత్తి సంగమం' కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనది సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు. ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి లింగాల కోసం భీముణ్ణి కాశీకి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని, ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని మరొక కథనం.
సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు. సంగమేశ్వరాలయం, దాని పక్కన భుజంగేశ్వరాలయాలు మహాబలిపురంలో రాతి రథాలను పోలివుండేవి. ఆలయుం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలున్నాయి. అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీప ంలో పాప నాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.
శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా, పురాతత్వ శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ బ్రహ్మాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీప ంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నందికొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు.సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉంది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాలన్నీ చూడాలంటే కర్నూలు కేంద్రం చేసుకొని చూడొచ్చు. అదే అనుకూలం.
ఇది ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.
ఓం నమః శివాయ

Related Posts