కామారెడ్డి జూన్ 02
గాంధీజీ బాటలో నడిచి తెలంగాణ సాధించుకున్నాం అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 9 వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సభాపతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ, రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తూ, ఇది గొప్ప అనుభూతి, అనుభవం. భారతదేశానికి మహాత్మాగాందీ నాయకత్వంలో అహింసా మార్గంలో పోరాడి ఏవిధంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్నామో, అహింసా నే సాధనంగా 2001 లో ప్రారంభించబడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ దర్శకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో అహింసా మార్గంలో కొనసాగి ప్రత్యేక రాష్ట్రం సాదించాం అన్నారు. 1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్ధిగా పాల్గొని పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని ఒకరోజు జరిగిన పోలీసుల తుపాకీ కాల్పుల్లో నా తోటి విద్యార్ధి బలి అయ్యాదాని, అని స్పీకర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల ప్రాణ త్యాగాలను ఏనాటికీ మరవమని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉన్నదని, డెబ్బై ఏళ్ళలో మిగతా రాష్ట్రాలు సాదించలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గడిచిన ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాదించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అధికారంలోని ప్రభుత్వం చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు విమర్శలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న పరిస్థితులలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. అంతకుముందు కామారెడ్డి పట్టణంలోని అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి , పోలీసు కిష్టయ్య, చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ శరత్, ఎస్పి యన్ .శ్వేతా, జడ్పి చైర్ పర్సన్ దఫేదార్ శోభా రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.