YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో తోడళ్లుల రాజకీయం

విశాఖలో తోడళ్లుల రాజకీయం

విశాఖపట్టణం, జూలై 19, 
విశాఖలో టీడీపీ చతికిలపడిపోయింది. రెండేళ్ల క్రితం సిటీలో నాలుగు సీట్లు గెలుచుకున్న టీడీపీకి ఇపుడు మాత్రం ఆ ఊపూ ఉత్సాహం ఏ కోశానా లేవు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి పసుపు పార్టీని పరుగులు పెట్టించాలని టీడీపీ చూస్తోంది. విశాఖ విషయంలో చంద్రబాబుతో పాటు చినబాబు లోకేష్ కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారుట. విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రకటించడంతో టీడీపీకి ఇజ్జత్ మే సవాల్ గా మారుతోంది. ఇప్పటి నుంచే చక్కబెట్టుకోకపోతే రానున్న కాలంలో మరింత డ్యామేజ్ జరుగుతుంది అన్నదే పార్టీ పెద్దల ఆందోళనగా ఉంది.గత ఎన్నికల ముందు బాలక్రిష్ణ అల్లుళ్ళు ఇద్దరు చేరో దారిలో పయనించారు. వారి మధ్య కోఆర్డినేషన్ లోపం వల్లనే పార్టీ బాగా నష్టపోయింది అన్న మాట కూడా ఉంది. చివరిదాకా తేల్చకపోవడంతో భీమిలీ లాంటి కంచు కోటను కోల్పోయామని, ఆ ప్రభావంతో మరో రెండు మూడు సీట్లు కూడా చేజారాయి అన్నది టీడీపీ విశ్లేషణ. ఈసారి అలాంటి పొరపాట్లు రానీయకుండా ముందే తోడల్లుళ్ళు ఇద్దరూ ఒక మాటకు వచ్చారని టాక్. ఈ క్రమంలో భీమిలీ నుంచి లోకేష్ పోటీ చేయాలని, విశాఖ ఉత్తరం నుంచి భరత్ పోటీకి దిగాలని డిసైడ్ అయినట్లుగా భోగట్టా. విశాఖ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద బాగా పడుతుందని వూహిస్తున్నారు. నిజానికి ఈ మూడు జిల్లాలూ ఒకనాడు టీడీపీకి పట్టుగొమ్మలే కానీ మారిన రాజకీయంలో వైసీపీ వైపుగా వెళ్ళాయి. అందువల్ల టీడీపీ వైపుగా మళ్ళీ ఈ జిల్లాలు మళ్ళాలి అంటే ఇక్కడ హై కమాండ్ అటెన్షన్ అవసరమని భావించే ఇలా తోడల్లుళ్ళు దిగిపోతున్నారుట. గతసారి ఎంపీగా పోటీ చేసిన భరత్ ఈసారి అసెంబ్లీకి రావడానికి ఉత్సాహం చూపుతూంటే లోకేష్ సైతం దాన్ని ప్రోత్సహిస్తున్నారుట. గతంలో లేని విధంగా తోడళ్ళులు ఒక్కటికావడం వెనక బాలయ్య ఉన్నార‌ని అంటున్నారు. ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా తన ఇద్దరు అల్లుళ్ళూ సమర్ధులే అంటూ కితాబు ఇచ్చారు. అందువల్ల టీడీపీలో అల్లుళ్ళు ఇద్దరూ ఒక వెలుగు వెలగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారుట. దానికి తోడు విశాఖ నుంచి నమ్మకమైన పార్టీ నేత టీడీపీకి లేకపోవడం వల్ల కూడా భరత్ మీద దృష్టి పడింది అంటున్నారు. మరి ఇద్దరు తోడల్లుళ్ళూ కలిస్తే విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలోని టీడీపీకి వైభోగం దక్కుతుందా అన్నది చూడాల్సిందే.

Related Posts