YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రెండు పెద్ద వికెట్లు డౌన్

ఏపీలో రెండు పెద్ద వికెట్లు డౌన్

విజయవాడ, ఫిబ్రవరి 16,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 24 గంటల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ. రెండోది డీజీపీ స్థానం నుంచి గౌతం సవాంగ్ ను తప్పించడం. ఈ రెండు పాలనాపరమైన నిర్ణయాలు అయినప్పటికీ రాజకీయంగా కొంత చర్చకు దారి తీసింది. ప్రవీణ్ ప్రకాష్ తప్పుడు సలహాలు ఇవ్వడం, అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం వల్లనే బదిలీ అయ్యారన్నది అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. అదే డీజీపీ గౌతం సవాంగ్ తొలి నుంచి కొంత ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడుగా కూడా ఉన్నారు. అయితే ఇటీవల చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడానికి పోలీసుల వైఫల్యమేనని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్క కార్యక్రమంతో తాను మూడేళ్లు సంపాదించుకున్న ఇమేజ్ పోయిందని జగన్ భావిస్తున్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం దిగి రావడానికి, ప్రభుత్వ ఖజానాపై భారం పడటానికి డీజీపీ వైఖరి కారణమని జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతుంది. ఎందుకు బదిలీ చేశారు? అయితే దీనిపై రాజకీయ రచ్చ మొదలయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ డీజీపీ బదిలీపై స్పందించారు. డీజీపీని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. చలో విజయవాడ సక్సెస్ అయినందునే డీజీపీ బదిలీ జరిగిందని భావించాల్సి ఉంటుందన్నారు. డీజీపీని బదిలీ చేసి ఉన్నతాధికారుల నుంచి చిరుద్యోగికి జగన్ హెచ్చరిక పంపారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ను కూడా ఆకస్మికంగా బదిలీ చేయడం ఈ సందర్బంగా గుర్తుకొస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. డీజీపీ గౌతం సవాంగ్ బదిలీపై టీడీపీ కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తున్నా డీజీపీ గా గౌతం సవాంగ్ ను ఎందుకు బదిలీ చేశారని టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ విధులను గుర్తించి నిర్వహించాలన్నారు. రూల్స్ ప్రకారం వ్యవహరించాలని వర్ల రామయ్య హితవు పలికారు. జగన్ అధికారులను వాడుకుని కరివేపాకులా తీసి పారేస్తారన్న విషయాన్ని గుర్తించాలని వర్ల రామయ్య కోరారు. మొత్తం మీద ప్రవీణ్ ప్రకాష్, గౌతం సవాంగ్ బదిలీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
జవహర్ రెడ్డికే ఆ ప్లేసా
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఐఏఎస్ లలో ఇది ప్రధానమైన, కీలకమైన పోస్టు. సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమించాల్సి ఉంది. అది ఎవరన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ గత మూడేళ్లుగా అధికారులపైనే ఆధారపడి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినప్పుడు వాటికి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎంవో కార్యదర్శిపైనే ఉంటుంది. దీంతో పాటు పాలనపరమైన విషయాలతో పాటు రాజకీయంగా కూడా అధికార పార్టీ నేతలకు కొంత అందుబాటులో ఉంటూ వారి నియోజకవర్గ సమస్యలను పరిష‌్కరించాల్సి ఉంటుంది. జగన్ కు, పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సీఎంవో కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఎన్నికల సమయం పెద్దగా లేదు. గట్టిగా రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విమర్శలు పాలు కాకుండా ఉండాలి. ముఖ్యమంత్రికి వాస్తవాలు వివరించి, ఆయన అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కీలకమైన సమయంలో సీఎంవో కార్యదర్శిగా అనుభవం, ప్రభుత్వానికి మచ్చ తేకుండా ఉండే ఐఏఎస్ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంగా ఉన్న ఈవో జవహర్ రెడ్డిని సీఎంవో కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో సీనియర్ అధికారిణి శ్రీలక్ష్మి ఉన్నా ఆమెను నియమిస్తే రాజకీయ పరమైన విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే జగన్ టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని సీఎంవో కార్యదర్శిగా నియమిస్తారని తెలిసింది. జవహర్ రెడ్డి అయితే అధికారులతో పాటు అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లగలరని జగన్ భావిస్తున్నారని సమాచారం.

Related Posts