YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

పుతిన్ తో మాట్లాడిన ప్రధాని

పుతిన్ తో మాట్లాడిన ప్రధాని

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25,
ఉక్రెయిన్‌పై యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్‌ లో మాట్లాడారు. యుద్ధం ఆపాలని ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడిని కోరారు. చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలని సూచించారు.  యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ లో నెలకొన్న దీన పరిస్థితులను మోడీ పుతిన్ కు  వివరించారు. ఉక్రెయిన్‌లో నివసిస్తోన్న భారతీయ విద్యార్థుల క్షేమం గురించి ఆలోచించాలని కోరారు.  కాగా మొదటి నుంచి భార‌త్‌కు ర‌ష్యా మిత్రదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వెంటనే యుద్ధాన్ని నిలిపేయాల‌ని పుతిన్‌ను ప్రధాని కోరడం చర్చనీయంశంగా మారింది. అయితే పుతిన్‌ యుద్ధం కొనసాగింపునకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి దారి తీసిన పరిస్థితులను పుతిన్‌ మోడీకి వివరించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్‌ తటస్థ వైఖరిని అవలంభిస్తుందని భారత విదేశాంగశాఖ గురువారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. శాంతియుత మార్గాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల భద్రత పైనే ప్రధాన దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది. అయితే ఇంతలోనే మోడీ పుతిన్‌కు ఫోన్‌ చేసి యుద్ధం ఆపమనడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికంటే ముందే మరోవైపు ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం కారణంగా దేశంపై ప్రతికూల ప్రభావం పడకుండా నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాజా పరిణామాలు, ముడి చమురు ధరలు తగ్గించే మార్గాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Related Posts