YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

నేపాల్‌ను వణికిస్తున్నవరుస భూకంపాలు

నేపాల్‌ను వణికిస్తున్నవరుస భూకంపాలు

ఖాట్మండ్ నవంబర్ 4
 హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శుక్రవారం నేపాల్‌లోని వాయువ్య ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. ఈ ఘటనలో సుమారు 140 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాజర్‌కోట్‌ జిల్లాలోని లామిదండా ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. సుమారు 15 సెకన్లపాటు భూమి కంపించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఢిల్లీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. వరుస భూకంపాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు
గతంలో వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ లో పనిచేసిన భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ కీలక సూచనలు జారీ చేశారు. నేపాల్‌లోని సెంట్రల్ బెల్ట్ ప్రాంతాన్ని ‘భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంగా’ గుర్తించినట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా.. సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
శుక్రవారం నేపాల్ చోటుచేసుకున్న భూకంపానికి సంబంధించి.. దోటి జిల్లాకు సమీపంలో భూకంప కేంద్రం ఉందని చెప్పారు. 2022 నవంబర్‌లో ఇదే జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించందని.. అప్పుడు ఆరుగురు మరణించారని తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 3న నేపాల్‌లో వరుసగా సంభవించిన భూకంపాల శ్రేణి కూడా అదే ప్రాంతంలో ఉందని అజయ్ పాల్ వివరించారు. అవి కొద్దిగా పశ్చిమం వైపు ఉన్నప్పటికీ.. నేపాల్ సెంట్రల్ బెల్ట్‌ ప్రాంతానికి దగ్గరా ఉన్నట్లు తెలిపారు. ఏక్షణమైనా భూకంపాలు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ ఉత్తరాన కదులుతున్నప్పుడు యురేషియన్ ప్లేట్‌తో విభేదిస్తున్నందున హిమాలయ ప్రాంతాన్ని ‘ఎప్పుడైనా’ భారీ భూకంపం తాకుతుందని పలువురు శాస్త్రవేత్తలు ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 40-50 మిలియన్ సంవత్సరాల క్రితం.. ఇండియన్ ప్లేట్ హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరం వైపు కదిలి యురేషియన్ ప్లేట్‌ను తాకినప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయని చెబుతారు.

Related Posts