YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

భీష్మ ఏకాద‌శి..

భీష్మ ఏకాద‌శి..

- భీష్మ యోగి 
 

లోకరీతి, లోకనీతి తెలిసి మెలిగేవారు, స్థితప్రజ్ఞులు, నియమానువర్తులను లోకం ఏదోరూపంలో స్మరిస్తూనే ఉంటుంది. యుగాలు గడిచినా అలాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు స్మరణదినాలుగా నిలిచిపోతాయి. అలాంటి రోజుల్లో మాఘ శుక్ల ఏకాదశి ఒకటి. ఈరోజుకు జయైకాదశి అని పేరు. భీష్ముడి పేరిట భీష్మైకాదశి అని ప్రసిద్ధమైంది.


గంగాదేవికి శంతన మహారాజు ద్వారా జన్మించిన ఎనిమిదో సంతానం దేవవ్రతుడు. తొలి ఏడుగురి సంతానాన్ని నది పాలు చేసింది గంగ. అయినా తానేం చేసినా ఎదురాడకుండా ఉన్నన్నాళ్లే కాపురం చేస్తానన్న గంగ మాటకు కట్టుబడి శంతనుడు కిమ్మనలేదు. దేవవ్రతుణ్నీ అలాగే చేయబోతే వారించాడు శంతనుడు. దాంతో ఆ బిడ్డను వదిలిపెట్టి గంగ వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల పేర్లతో ఆ శిశువు శాంతనవుడు, గాంగేయుడుగా ప్రసిద్ధుడయ్యాడు. వసిష్ఠ మహర్షి దగ్గర శిష్యరికం చేశాడు. అస్త్రశస్త్రాది యుద్ధవిద్యల్లో, ధర్మశాస్త్రాల్లో నిష్ణాతుడయ్యాడు. యౌవరాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. కొద్ది రోజుల్లో తండ్రి తరవాత రాజుగా పట్టాభిషిక్తుడు కావాల్సి ఉంది. అలాంటి సమయంలో సత్యవతి మీద తన తండ్రి మనసుపడ్డాడని, ఆమెకు కలిగిన సంతానాన్ని రాజు చేస్తేనే ఆమె శంతనుణ్ని వివాహమాడుతుందని దాశరాజు షరతు విధించాడని తెలుసుకున్నాడు. పట్టపురాణి బిడ్డను వదిలి, మనసుపడ్డదాని బిడ్డను రాజుగా చేయడమెలాగని తండ్రి మథనపడుతున్నాడనీ వింటాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జన్మనిచ్చిన తండ్రి కోరిక తీర్చడం కొడుకుగా తన ధర్మమని భావించాడు దేవవ్రతుడు. వెంటనే దాశరాజు దగ్గరకెళ్లాడు. ఆమెకు పుట్టిన బిడ్డలకే రాజ్యాధికారం కల్పించడం కోసం తాను రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నానని చెప్పాడు. ఆ మాటకు దాశరాజు- నీకు పుట్టిన బిడ్డలు అడ్డుపడరని నమ్మకమేమిటని నిలదీస్తాడు. అదీ నిజమేననిపించి క్షణం ఆలోచించాడు. తేరుకుని తాను వివాహమే చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మ(భీకర)మైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజు నుంచీ భీష్ముడిగా ప్రసిద్ధుడయ్యాడు. 
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు రాజయ్యాక గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్రవీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. అతడూ సంతానరహితుడిగానే మరణించాడు. తన వంశం నిర్వంశం కాబోతూంది, ఆ ప్రమాదం నుంచి కాపాడాలనే ఆలోచనతో పినతల్లి అయిన సత్యవతి భీష్ముణ్ని పిలిచింది. రాజ ధర్మానుసారం తమ్ముడి భార్యల్ని సంతానవతులుగా చేయమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలినట్లవుతుందనిపించి నిరాకరించాడు. అయినప్పటికీ- వేదశాస్త్రాలు తెలిసిన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులుగా చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. 
కురు పాండవుల మధ్య రాజ్యార్హత అంశం వివాదాస్పదమై యుద్ధానికి దారి తీసింది. కౌరవ పక్షం వహించాడు భీష్ముడు. ధర్మబద్ధంగా యుద్ధం చేశాడు. అయినా పాండవ పక్షపాతం చూపుతున్నాడంటూ సైన్యాధ్యక్ష పదవినుంచి వైదొలగమన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోవడానికి ఇష్టపడలేదు. భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతకాలం కౌరవుల్ని జయించడం అసాధ్యమనిపించింది పాండవులకు. అందుకే భీష్ముణ్ని రహస్యంగా కలిసి మార్గం చూపించమని వేడుకున్నారు. అతడు సూచించిన విధంగా శిఖండిని యుద్ధంలో ఎదురుగా నిలబెట్టారు. యుద్ధనియమం ప్రకారం- భీష్ముడు అస్త్రసన్యాసం చేశాడు. అదే అదనుగా అర్జునుడు వేసిన బాణం దెబ్బకు నేలకూలాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడటం అరిష్టమని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేనువాల్చిన అతడు కొద్దిరోజుల్లో రానున్న ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని తలపోశాడు. దేవతలు ఇచ్చిన వరప్రభావంతో మరణాన్ని నియంత్రించుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం, అందునా మాఘ మాసం, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశినాడు తన నిర్యాణానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా మాఘ శుక్ల సప్తమి మొదలుకుని, ఏకాదశి నాటికి పూర్తిగా విష్ణువులో లీనమైపోయాడు. ఆ అయిదురోజుల్నీ భీష్మ పంచకం అంటారని పురాణ కథనం. భీష్ముడి నిర్యాణ విధి జగతికి స్మరణదినమైంది. ఆయన పేరు మీదే ఆ తిథికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.

Related Posts