YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ప్రగతికి సోపానం..

ప్రగతికి సోపానం..

బమ్మెర పోతన చెప్పినట్లు పుస్తకం హస్తభూషణం. పుస్తకాల అధ్యయనం ఒక తపన, తీరని విజ్ఞాన దాహం. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా నడిపించే నిజమైన చోదకశక్తిగా భావిస్తాము. మనిషికి మరణం ఉండవచ్చు కాని పుస్తకానికి, దాని ద్వారా అర్జించిన విజ్ఞానానికి మరణం లేదు. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది. ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. వివిధ భాషలపై పట్టును పెంచుతుంది.

బెంజమిన్ ప్రాంక్లిన్ చెప్పినట్లు పుస్తక పఠనం వల్ల ఉన్న చోటి నుంచే ఈ ప్రపంచాన్ని చూడవచ్చు. ఈ రోజుల్లో ప్రపంచ వీక్షణానికి పుస్తకం తొలిమెట్టు. పుస్తక పఠనం లేకపోతే ఈ సమాజం కలంలేని, కాగితంలేని మేధస్సు లేని విధంగా నిర్జీవ సమాజంగా సాగుతుంది. ఈ స్థితి మారాలంటే, సమాజం పునర్జీవం పొందాలంటే పుస్తకాలను చదవాల్సిందే. పుస్తకాలు మనిషిలోని భావాలకు, ఊహలకు అక్షర రూపం ఇచ్చి కవులుగా, రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సాహితీ వేత్తలుగా, మేధావులుగా తీర్చిదిద్దుతాయి. చదివిన  పుస్తకాలను ఇతరులు కూడా చదివేందుకు వీలుగా గ్రంథాలయాలకు ఇవ్వాలి.

కాలగమానానికి పుస్తకాలే పునాది రాళ్ళు. నిన్నటి చరిత్ర నుంచి రేపటి చరిత్రకు పుస్తకాలే ఊపిరి. విద్యార్థులు తమ పాఠశాలల్లోని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. వారి లక్ష్య నిర్దేశానికి వారి జీవన మనుగడకు మానసిక ఉల్లాసానికి ప్రేరణగా పుస్తకాలు తోడ్పడుతాయి. ఈ పుస్తకాల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది.

ప్రతి సంవత్సరం డిసెంబర్/జనవరి మాసంలో పుస్తక ప్రదర్శనలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాదు, విజయ వాడల్లో నిర్వహిస్తున్నారు. నగరాలకే పరిమితం చేయకుండా ప్రతి జిల్లాలో పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలి. విజ్ఞానాన్ని ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నం చేయాలి. మానవ విలువలను పెంపొందించడానికి  పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి. వేడుకలల్లో పుస్తకాలను బహుమతిగా ఇచ్చే మంచి సంప్రదాయాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి. పుస్తకం చదువితే విభిన్న వ్యక్తుల వ్యక్తిత్వాలు, ప్రదేశాలు వాటి వివరాలు వేర్వేరు కోణాల్లో వారివారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుస్తాయి. మంచిచెడు, పెద్దలతో  ఎలా నడుచుకోవాలో తెలుపుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే చదివే అలవాటు చేయడానికి బొమ్మల కథలతో కూడిన పుస్తకాలు (బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర)తో మొదలుపెట్టాలి.

స్టోరీ టెల్లింగ్ ఆడియో, వీడియోలను చూపించాలి. స్నేహితుడు లేకపోయినా పరువాలేదు గానీ పుస్తకం చదివే అలవాటు లేని వారిని వదిలిపెట్టగకూడదు. పుస్తకం నేటి సమాజంలో ఒక వ్యక్తి దైనందిన జీవితంలో భాగంగా భావించాలి. నేడు మనకంటే అభివృద్ధి చెందిన యూరోప్, అగ్రదేశం అమెరికా, సింగపూర్, మలేసియాల్లో యువకులల్లో మనిషికో ఆపిల్ ఫోను, గదికో ప్లాస్మా టీవీ, వర్చువల్ రియాలిటీ గేమ్‌లు మనకంటే ఎన్నోరెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అవకాశం ఉన్నా అక్కడి వారికి పుస్తకాలంటే అభిమానం చూపుతారు.

పిల్లల్లో సృజనాత్మకత కోసం, భావ వ్యక్తీకరణ కోసం పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం కావాలి. ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. పాఠశాలల్లో పుస్తకాలు చదవడం, వాటిని విశ్లేషించడం, రివ్యూలు రాయడం వంటివి నిత్యకృత్యాలుగా చేయాలి. వారికి ఏ సాహిత్యం ఇష్టమో దాన్నే ఎంచుకోనివ్వాలి. పుస్తక రచయితలను విద్యాలయాలకు పిలిపించి పిల్లలతో ముఖాముఖి ఏర్పాటు చేయించాలి.

న్యూయార్క్ నగరంలో మెట్రో రైళ్లలో ఎక్కువ మంది పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. మన దేశంలోని విద్యార్థులు పాఠ్యపుస్తకాలు మాత్రమే చదువుతారు. ఇతర రచనలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంబంధించిన పుస్తకాలు చదవడం అరుదు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను ఆహ్వానించడంలో తప్పులేదు, కానీ పుస్తక పఠనం మన జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుందో గుర్తించాలి.

Related Posts