హైదరాబాద్, ఏప్రిల్ 22,
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఇంకోవైపు కూతరు అరెస్ట్.. మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు.. ఇలా వరుస పరిణామాలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే క్యాడర్లో నిస్తేజం.. నైరాష్యం నెలకొంది. ఈ పరిస్థితిలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు, క్యాడర్లో ఉత్సాహం, ఉత్తేజం నింపడమే లక్ష్యంగా కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. మే 10వ తేదీ వరకు నిర్వహించే ఈ యాత్రలో 24 రోడ్షోలు నిర్వహించబోతున్నారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రచార యాత్రం. కానీ, దీనిని అధికారికంగా ఆ పార్టీ ప్రకటించుకోలేని పరిస్థితి. ప్రజల సమస్యల పరిష్కార యాత్రగా పరిష్కారం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ బస్సు యాత్రలో ఐదు నియోజకవర్గాలను వదిలేశారు. 12 నియోజకవర్గాల్లో మాత్రమే సాగాలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆ ఐదు నియోజకవర్గాలను ఎవరి కోసం వదిలేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కేసీఆర్ బస్సు యాత్రలో ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలు లేవు. దీంతో ఆ నియోజకవర్గాలను కేసీఆర్ కావాలనే తప్పించారని తెలుస్తోంది. వాటిలో మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాలను బీజేపీకి వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించారని ప్రచారం జరుగుతోంది.కూతురు కవితను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కేసీఆర్ ఇప్పటికే బీజేపీ నుంచి సుపారీ తీసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపారని తెలిపారు. ఇప్పుడు రేవంత వ్యాఖ్యలను నిజం చేసేలా కేసీఆర్ బస్సు యాత్రను 5 నియోజకవర్గాలను మినహాయించారు. ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర లేదు. దీంతో బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుతోంది.ఇదిలా ఉంటే.. బస్సు యాత్ర లేని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కానీ ఏప్రిల్ 24 నుంచి మే 10వ తేదీ వరకు పూర్తిగా కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఐదు నియోజకవర్గాల్లో సభలు లేనట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో మాత్రం కేటీఆర్, హరీశ్రావుతో రోడ్షోలు నిర్వహిస్తారని సమాచారం. మిగతా నాలుగు నియోజకవర్గాలను బీజేపీ కోసం వదిలేసినట్లే అని తెలుస్తోంది.