
ఖమ్మం, మే 3,
కిలో మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది..? రూ.200 లేదా రూ.300 రూపాయలు ఉంటుంది. కానీ ఒక్కసారి ఊహించుకోండి... ఒక కిలో మామిడి పండ్ల ధర అక్షరాలా మూడు లక్షల రూపాయలు.. పలుకుతోంది. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ? అంత పెద్ద మొత్తంలో ధర పలకడానికి ఆ మామిడి పండ్లలో అంత ప్రత్యేకత ఏముందో తెలుసుకోవాలని ఉందా..? అయితే దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ఆ అరుదైన మామిడి పండ్లనే ‘మియాజాకీ’ అంటారు. వాటికున్న డిమాండ్ను బట్టి ధర ఒక్కోసారి కిలో మూడు లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్న ఖమ్మం నగరానికి చెందిన ఓ రైతు కరోనా లాక్డౌన్ సమయంలో ఒక ఆసక్తికరమైన ఆలోచన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత డిమాండ్ ఉన్న ఈ మామిడిని మన నేలపై పండిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి వెంటనే రంగంలోకి దిగారు. మధ్యవర్తుల ద్వారా కాలిఫోర్నియా నుండి ఒక్కో మొక్కను అక్షరాలా 12 వేల రూపాయలు వెచ్చించి మరీ 30 మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. 2020లో నాటిన ఈ మొక్కలు ఇప్పుడు బంగారు పంటను పండిస్తున్నాయి. ఆ రైతు చెప్పిన వివరాల ప్రకారం.. ఒక్కో చెట్టుకు 2024లో 30 కాయలు కాగా, 2025లో ఏకంగా 80 కాయలు కాశాయి. ఒక్కో కాయ బరువు దాదాపు 500 గ్రాములు ఉంటుందట.. ఇతర మామిడి రకాల కంటే ఇది నెల ముందుగానే పూత, కాతకు రావడం మరో విశేషం. ఇక్కడి నేల ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో.. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీ నుండి ఒక్కో మొక్కను 3,500 రూపాయల చొప్పున మరో 120 మొక్కలను కూడా కొనుగోలు చేశారు. అదనంగా మరో ఎకరం విస్తీర్ణంలో ఈ సాగు చేపట్టగా, ప్రస్తుతం వచ్చిన పండ్లను కేవలం కుటుంబ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన పంటను త్వరలోనే మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.
మియాజాకీ మామిడి రకాన్ని పండిస్తోన్న కాకినాడ రైతు.. కేజీ రూ.2.7 లక్షలు జిల్లా ఉద్యాన అధికారులు ఈ అరుదైన మామిడి రకం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ తోట పూతకు వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పండ్ల ధర కిలో 2.50 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు పలుకుతాయన్నారు. రాష్ట్రంలో బహుశా ఈ ఒక్క రైతు మాత్రమే ఈ రకం మామిడిని సాగు చేస్తున్నారని భావిస్తున్నారు.
ఈ రకమైన మామిడి రసం పీల్చే పురుగులు (తామర పురుగులు, నల్లి) మరియు ఆకుమచ్చ వంటి తెగుళ్లకు త్వరగా గురవుతుంది. ఈ పండ్లకు ఇంత అధిక ధర ఉండటానికి ప్రధాన కారణం వాటి ప్రత్యేకమైన రుచి, క్రీమీ ఆకృతి.. పరిమిత ఉత్పత్తి. ఇవి ముదురు ఎరుపు లేదా ఊదా రంగులో ఉండి చాలా తియ్యగా ఉంటాయి. అంతేకాదు.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు (సి, ఇ, ఎ, కె).. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.మియాజాకీ మామిడి రకం మొట్టమొదటగా 1984లో జపాన్లోని మియాజాకి ప్రాంతంలో పండించబడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం జపాన్లోనే వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. మన దేశంలో కూడా పంజాబ్కు చెందిన ఒక రైతు ఈ రకం మామిడిని సాగు చేసి, వాటి భద్రత కోసం బౌన్సర్లను నియమించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.