
వరంగల్, మే 5,
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపై భద్రత బలగాలు భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. తొమ్మిది రోజులుగా కొనసాగిన ఆపరేషన్లో ఒక్కో అడుగు ముందుకేసి మావోయిస్టు డెన్ను ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంటకాలు దాటుకొని మావోయిస్టుల అడ్డాలో జాతీయ జెండాను ఎగరేశారు.కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బలగాలు పైచేయి సాధించాయి. మావోయిస్టులకు చెక్ పెట్టడానికి ఆపరేషన్ కర్రెగుట్టలను చేపట్టాయి బలగాలు. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులకు డెన్గా ఉన్న ప్రాంతాలను గుర్తించిన భద్రత బలగాలు ఆ ప్రాంతాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కర్రెగుట్టలో వేలాది బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి సీఆర్పీఎఫ్ బెస్ క్యాంప్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది.కర్రెగుట్టల్లో వేలాది మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో దాదాపు పది రోజుల క్రితం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే నిజంగానే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న సంగతి తెలుసి తప్పించుకుపోయారా? లేదా కర్రెగుట్టల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి బలగాల వ్యూహమా ప్రకారం ఇలాంటి ప్రచారం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏమైనా సరే తొమ్మిది రోజులుగా బలగాల ఆపరేషన్ తుది దశకు చేరిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టులు అమర్చిన వివిధ బాంబులు నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగారు. డంపులు స్వాధీనే చేసుకొని సొరంగాలు గుర్తించి లక్ష్యానికి చేరువవుతున్నారు. తాజాగా బలగాలు కర్రెగుట్ట సమీపంలోని ధోబీ కొండను స్వాధీనం చేసుకున్నారు. ధోబీ కొండ కర్రెగుట్టకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పటివరకు మావోయిస్టులు ఆక్రమించిన రెండు కొండలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. నీలం సారాయ్ కొండను స్వాధీనం చేసుకున్న తర్వాత ధోబీ కొండను స్వాధీనం చేసుకున్నారు. ఆ కొండలపై బలగాలు జాతీయ జెండాను ఎగరవేశాయి. దీంతో కర్రెగుట్టల ప్రాంతంలో నిరంతర సెర్చ్ ఆపరేషన్ జరగనుంది.ఈ టైంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ స్వయంగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకొని, ఆపరేషన్ వివరాలు సీఆర్పీఎఫ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఐబీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్యాంప్ ఏర్పాటుతో ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నారు. దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలపై గట్టిపట్టు సాధించేందుకు ఇది కీలకమైన అడుగ్గా అధికారులు భావిస్తున్నారు.