
హైదరాబాద్, మే 6,
తెలంగాణలో రోజున ఆందోళనకర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘుడు గర్జిస్తుండగా.. మరోవైపు భూమి కంపిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
మధ్యాహ్నం వరకు భానుడు నిప్పుల వర్షం కురించగా.. సాయంత్రం సమయంలో ఇక ఇప్పుడు నా వంతు అన్నట్టుగా ఈదురుగాలులను వెంటేసుకుని వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఉరుములు మెరుపులతో వరుణుడికి మేఘుడు గట్టిగానే ఎలివేషన్ ఇచ్చాడు. అంతేనా.. భానుడు నిప్పుల వర్షం కురిస్తుంటే.. నేను కేవలం వాన కురిపిస్తే ఎలా అనుకున్నాడో ఏమో.. వడగండ్ల వానతో విరుచుకుపడ్డాడు వరుణుడు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భూప్రకంపనలు జనాలను మరింత భయాందోళనలకు గురి చేశాడు. భూప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారుహైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కరీంనగర్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 3 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో మొదలైన వర్షం.. మెల్లగా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్లుగా మారి బీభత్సం సృష్టించింది. గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉండటంతో.. జనాలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు వీయటంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
అక్కడక్కడ పిడుగులు కూడా పడినట్టు సమాచారం. అటు వర్షం తగ్గక.. ఇటు కరెంట్ లేక.. జనాలు ఇక్కట్లు పడ్డారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది.ఇక.. హైదరాబాద్లో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. మధ్యాహ్నం భగభగమండిన ఎండ ఒక్కసారిగా చల్లబడి, ఆకాశం నల్లగా కమ్ముకుంది. ఆ తర్వాత మిన్ను విరిగి మీద పడ్డట్టుగా భీకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది.
సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, పంజాగుట్ట, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సరిగ్గా ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో.. తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షంతో ఉక్కిరిబిక్కిరి కాగా.. ఇదే నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో చినుకు కూడా రాలకపోవటం గమనార్హం. హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరుగుతుండగా.. ఆ మ్యాచ్కు వర్షం ఎలాంటి ఆటంకం కలిగించకపోవటం ఆశ్చర్యకరం. ఆ ప్రాంతంలో చినుకు కూడా పడకపోవటం విచిత్రమే. కాసేపటికి మళ్లీ అక్కడ కూడా వర్షం అందుకుందనుకోండి.అయితే.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురుస్తుండగా.. ఉత్తర తెలంగాణలో మరో భయం వెంటాడింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాల్లో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైనట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం రెండుసార్లు భూమి కంపించిన అనుభూతి కలిగింది.వర్షం చల్లదనాన్నిస్తే, భూమి కంపించడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఈ రెండు అనూహ్య పరిణామాలతో సోమవారం రాత్రి హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది.