
తిరుపతి, జూన్ 20,
ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పంపిణీ విధానంలో మార్పులు రానున్నాయి. కేంద్రం ఫేస్ రికగ్నిషన్ గుర్తింపును తప్పనిసరి చేసింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. 3-6 ఏళ్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇది వర్తిస్తుంది. పౌష్టికాహారం పంపిణీలో మరింత పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం తీసుకునే పిల్లల వివరాలను నమోదు చేస్తారు. ఆగస్టు 1 నుంచి గర్భిణులు, పిల్లల నమోదులో కూడా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.పోషణ ట్రాకర్లో ఫేస్ రికగ్నిషన్ ఆధారిత సేవలను అమలు చేయనున్నారు. ఈ నెల 30 నుంచి లబ్ధిదారుల ప్రొఫైల్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీంతో పౌష్టికాహారం పంపిణీ సమయంలో FRS (ఫోటో క్యాప్చరింగ్, ఈ-కేవైసీ) తప్పనిసరి అవుతుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త విధానం వల్ల ఆహార పంపిణీలో మరింత కచ్చితత్వం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో వినూత్నమైన ఆలోచన చేసింది.. అంగన్వాడీ సెంటర్ల కోసం కంటెయినర్లను వాడుకలోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల కోసం పక్కా భవనం కట్టాలంటే ఎక్కువ సమయం పడుతోంది. అందుకేప్రభుత్వం కంటెయినర్లలో సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యంలోని గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను కంటెయినర్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అంగన్వాడీ కేంద్రాల కోసం కంటెయినర్లను సిద్ధం చేశారు అధికారులు. వీటిలో రెండు గదులు, బాత్రూమ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీని కోసం రూ.10 లక్షలు అవుతోందని అధికారులు చెబుతున్నారు.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ఆహారం గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని నిర్ణయించారు.. ఈ మేరకు 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేస్తున్నారు. ప్రతివారం రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్రైస్తో పాటుగా అదేరోజు ఉదయం టిఫిన్లో ఉడికించిన శనగలు అందిస్తారు. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగిస్తారు.. బాలామృతంలోనూ చక్కెర స్థాయిని తగ్గించి కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు బాలామృతంలో మార్పులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలకు అందించాల్సిన పోషకాలతో బాలామృతంలో మార్పులు చేసే బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.