YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాక్ ప్రధానమంత్రి నివాసంలో విలాసవంతమైన కార్ల వేలం

పాక్ ప్రధానమంత్రి నివాసంలో విలాసవంతమైన కార్ల వేలం

పొదుపు చర్యల్లో భాగంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నివాసంలో ఉన్న విలాసవంతమైన కార్లను వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక డాన్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకోవాలని, పొదుపు చేయాలని ఆ దేశ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం చేసిన రోజునే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లను వేలానికి ఉంచాలని నిర్ణయించారు.సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నివాసంలోనే ఈ వేలం కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిది బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. వీటిలో 2014 మోడల్‌కు చెందిన మూడు కార్లు, 5000సీసీ ఎస్‌యూవీలు మూడు, 3000సీసీ ఎస్‌యూవీ 2016 మోడల్‌ కార్లు రెండు ఉన్నట్లు డాన్‌ వెల్లడించింది. వీటితో పాటు 2016 మోడల్‌కు చెందిన నాలుగు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను కూడా వేలం వేయనున్నారు. ఇందులో రెండు 4000సీసీ బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మొత్తం 16 టయోటా కార్లను కూడా వేలానికి ఉంచారు. వాటిలో ఒకటి 2004 మోడల్‌ లెక్సస్‌ కారు, 2006 మోడల్‌ లెక్సస్‌ ఎస్‌యూవీ ఒకటి, 2004 మోడల్‌ లాండ్‌ క్రూజర్‌ రెండు కార్లు, 2003 నుంచి 2013 మోడల్స్‌కు చెందిన ఎనిమిది కార్లు వేలం వేసే జాబితాలో ఉన్నాయి.ఇవే కాకుండా 2015 మోడల్‌కు చెందిన నాలుగు బుల్లెట్‌ ప్రూఫ్‌ లాండ్‌ క్రూజర్‌ వాహనాలు కూడా వేలం వేయనున్నారు. వీటితో పాటు 1800 సీసీ హోండా కారు, సుజుకీ వాహనాలు మూడు అమ్మకానికి ఉంచారు. వేలం వేసే వాహనాల్లో 1994 మోడల్‌కు చెందిన హినో బస్‌ కూడా ఉండటం గమనార్హం. ఆగస్టు 18న పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తానని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉండబోనని తెలిపారు. ప్రధాని అధికారిక నివాసంలో దాదాపు 80 వాహనాలు, 524 మంది సిబ్బంది ఉంటారు. కేవలం మూడు పడక గదుల ఇంట్లో ఉంటూ ఇద్దరు సర్వెంట్లు మాత్రమే తనతో పాటు ఉంటారని ఆయన తెలిపారు.

Related Posts