ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. ఈ విజయానికి కారణమైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఈ విజయంతో గర్వంగానీ అహంకారం గానీ రావొద్దు. ప్రజలిచ్చిన తీర్పును కర్తవ్యంగా భావించాలని ముఖ్యమత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఎన్నికల ఫలితాల తరువాత అయన మీడియా తో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు పైత్యం ఉందని అన్నారు. అయన తెలంగాణ రాజకీయాలలో కలగజేసుకున్నాడు కదా మేము ఏపీ రాజకీయాలలో కలగజేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఏపీ నుండి నాకు ఈరోజు లక్ష ఫోన్లు వచ్చాయని పోటీ చేయాలని కోరారన్నారు. మేము ఏపీలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబుకు త్వరలోనే చూపిస్తామన్నారు. అత్యంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికలివి. ఒక్క బూత్లో కూడా రీపోలింగ్ లేకుండా ఎన్నికలు జరగడం విశేషం. ఎన్నికల కమిషన్, సీఈవో రజత్ కుమార్కు కృతజ్ఞతలు. ఎన్నికల సిబ్బందికి కూడా ధన్యవాదాలని అన్నారు. మీడియా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తామని అయన వెల్లడించారు. తెలంగాణ మేథావులు దేశానికంతటికీ ఉపయోగపడాలి. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పాలన రావాలి. మేము ఎవరికీ గులాంగిరీ చేయబోమని అన్నారు. దేశానికి 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉంటే వాడుకుంటున్నది 30 వేల టీఎంసీలు మాత్రమే. దేశానికి కొత్త, ఆర్థిక, వ్యవసాయ ప్రణాళిక కావాలని అయన అన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలన్నారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చామన్నారు. తమకు ప్రజలే బాస్లని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని చెప్పారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ఇక్కడి హవానే అక్కడా కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుందని, దేశ రాజకీయాలు స్టీరియో ఫోనిక్ గా మారాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం మారకపోతే బాగుపడదని అన్నారు. ఈరోజు వెలువడ్డ తెలంగాణ ఎన్నికల ఫలితాలు దేశానికి ఓ మార్గాన్ని చూపించాయని అన్నారు. కాళేశ్వరం మాకు కావాలని ప్రజలు తీర్పునిచ్చారు. రైతులకున్న బాధలన్నీ తీర్చేస్తాం. గిరిజనులకు, గిరిజనేతరులకు భూహక్కులు కల్పిస్తాం. బీడీ కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు విరివిగా కల్పిస్తామని అన్నారు. కార్మికుల జీవితాలన్నీ కుదుటపడాలి. నిరుద్యోగం కేవలం తెలంగాణకే పరిమితమైంది కాదు. ఉద్యోగ ఖాళీలను వేగంగా పూర్తి చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో.. బాధ్యత కూడా అంత బరువుగా ఉందని అయన అన్నారు. సస్యశామల, శాంతియుత తెలంగాణ మనకు కావాలి. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా పనులు చేపడతామని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని కేసీఆర్ అన్నారు.