తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోతుంది. అయితే కూటమితో జట్టు కట్టిన తెలంగాణ జన సమితి, సీపీఐ ఖాతా తెరవలేదు. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి.2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల నుంచి పోటి చేసిన సీపీఐ అన్ని చోట్ల ఓటమి పాలయ్యంది. బెల్లంపల్లి నుంచి గుండా మల్లేష్, హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి బానోతు విజయ పోటీ చేశారు. కానీ వీరు ముగ్గురు ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ కన్వీనర్ కోదండరాం ఆధ్యర్యంలో ఏర్పాటైన తెలంగాణ జనసమితి(టీజేఎస్) ఈ ఎన్నికల్లో బొక్కబొర్ల పడింది. ఆరు స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. మెదక్ నుంచి ఉపేందర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలిప్ కుమార్, వర్ధన్నపేట నుంచి పగిడిపాటి దేవయ్య, వరంగల్(ఈస్ట్) నుంచి గాదె ఇన్నయ్య, సిద్ధిపేట నుంచి భవాని రెడ్డి పోటీ చేశారు. వీరంతా అధికార టీఆర్ఎస్ అభ్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు.బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య, హుస్నాబాద్లో వడితెల సతీష్ కుమార్(టీఆర్ఎస్), వైరా నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించారు. సిద్ధిపేట నుంచి హరీశ్ రావుపై పోటీ చేసిన భవానీ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయినట్లు సమాచారం.