ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ కలిశారు. బుధవారం అయన రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ ను కలుసుకున్నారు. తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సభ్యుల వివరాలను గవర్నర్ కు రజత్ కుమార్ అందజేశారు. తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పార్టీల బలాబాలాలు గవర్నర్ పరిశీలించనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉన్న పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తారు. తరువాత రజత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసిందని ప్రకటించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలింగ్ ను నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ నెల 24 నుంచి మళ్లీ ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 14 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. తమ ఓటు హక్కు ఉందో, లేదో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని తెలిపారు. ఓటర్ లిస్టులో ఉన్న తప్పిదాలను సరిచేస్తామని చెప్పారు. ఓట్లు పోయిన వారంతా ఆన్ లైన్లో తిరిగి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. 23 లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే వార్తల్లో నిజం లేదని అయన అన్నారు.