YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఉగ్ర సంస్థలపై పాక్ చర్యలు

ఉగ్ర సంస్థలపై పాక్ చర్యలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉగ్రవాద నిషేధంపై అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో.. పలు ఉగ్ర సంస్థలపై పాక్ చర్యలు చేపట్టింది. ముంబై 26/11 దాడులకు కారణమైన హఫీజ్ సయిద్ నేత్రుత్వంలోని లష్కరే తోయిబా అనుబంధ సంస్థలు జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఉగ్రవాద సంస్థలను అధికారికంగా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. ఈ రెండు సంస్థలను నిషేధిస్తున్నట్టు ఫిబ్రవరి 21న ప్రకటించిన పాక్.. అధికారికంగా సోమవారం ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.ఈ మేరకు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ నిషేధం విధించిన ఉగ్ర సంస్థల జాబితాలో మొత్తం 70 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. అయితే జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఇ-ఇన్సానియత్ సంస్థలను ఉగ్రవాద జాబితాలో చేర్చినట్టు పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ.. అందులో నిజం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పాక్.. ఈ రెండు సంస్థలను నిఘా కొనసాగే జాబితాలోనే ఉంచింది తప్ప ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చలేదంటున్నారు. జనవరి 2017లో రూపొందించిన ఉగ్రవాద సంస్థల జాబితానే పాకిస్తాన్ మళ్లీ విడుదల చేసిందని.. అందులో కొత్తగా చేసిన మార్పులేమి లేవని అంటున్నారు.
44 మంది నేతల అరెస్ట్
గ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న వేళ.. ఆ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. జైషే మహ్మద్‌తో పాటు నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాద సంస్థలపై పాక్ సర్కారు కొరడా ఝలిపిస్తోంది. జైషే మహ్మద్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని దునియా న్యూస్ తెలిపింది. కాగా వారిని అదుపులోకి మాత్రమే తీసుకున్నారని కూడా వార్తలొస్తున్నాయి. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ అలియా ముఫ్తీ అబ్దుర్ రవూఫ్‌ను కూడా పాకిస్థాన్ కస్టడీలోకి తీసుకుందని సమాచారం.జైషే మహ్మద్‌కు చెందిన హమ్మద్ అజహర్‌ను అరెస్ట్ చేశామని పాక్ మంత్రి షెహర్యార్ ఖాన్ అఫ్రిదీ మీడియా సమావేశంలో తెలిపారు. గత వారం భారత ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో ముఫ్తీ అబ్దుర్ రవూఫ్, హమ్మద్ అజహర్‌ పేర్లు ఉన్నాయని పాక్ మంత్రి తెలిపారు. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకే ఇలా చేస్తున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వ్యక్తులు లేదా సంస్థలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలను అమలు చేయాలనే చట్టం సోమవారమే పాకిస్థాన్‌లో అమల్లోకి వచ్చింది. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న నిషేధిత ఉగ్రవాద సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.

Related Posts