YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

రవిప్రకాష్, శివాజీకి లుక్ ఔట్ నోటీసులు

రవిప్రకాష్, శివాజీకి లుక్ ఔట్ నోటీసులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీపై ఉచ్చుబిగుస్తోంది. సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంతో పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో రవిప్రకాశ్‌, శివాజీపై సైబరాబాద్‌ పోలీసులు శనివారం లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. టీవీ9 వ్యవహారంలో వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌, శివాజీ విదేశాలకు పారిపోకుండా ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రవిప్రకాశ్, శివాజీ విదేశాలకు పారపోకుండా విమానాశ్రయాలు, నౌకాశ్రయ అధికారులను అప్రమత్తం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. టీవీ9 వ్యవహారంలో ఏబీసీఎల్‌ పత్రాల ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్‌, శివాజీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వారిద్దరినీ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండు సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, వారు స్పందించలేదు. అటు ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రవిప్రకాశ్‌, శివాజీ కోసం మూడు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించినట్లు సైబర్‌క్రైం పోలీసులు తెలిపారు. మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం శోధిస్తున్నారు. షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని సృష్టించే క్రమంలో రవిప్రకాశ్‌కు, మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్ మూర్తి, ఇతరులకు మధ్య జరిగిన ఇ-మెయిల్ సంభాషణలు గురువారం బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కేసులో ముందు నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్న సైబరాబాద్ పోలీసులు పక్కా ఆధారాల సేకరించే పనిలో ఉన్నారు. కేసుకు సంబంధించిన పలు కీలక ఫైళ్లు, ఇతర లావాదేవీల సమాచారమంతా పలు డివైజ్‌లలో ఉండటంతో వాటిని వెలికితీసే పనిలో ఉన్నారు.
బంజారాహిల్స్‌లోని టీవీ9 కార్యాలయం, రవిప్రకాశ్‌తో పాటు, శివాజీ, ఎంకేవీఎన్ మూర్తి ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. టీవీ9 కార్యాలయం నుంచి 12 హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వాటిలో ఏ సమాచారాన్ని డిలీట్‌ చేశారు.. అందులోని సమాచారాన్ని ఎవరెవరికి పంపారనే కోణంలో సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు నటుడు శివాజీకి ఎన్సీఎల్టీలో భంగపాటు ఎదురైంది. టీవీ9 పాత యాజమాన్యానికి, సైఫ్‌ మారిషస్ ఫైనాన్స్ కంపెనీకి మధ్య వాటాల కొనుగోలు వ్యవహారంపై నడుస్తున్న కేసులో తనను కూడా ఇంప్లీడ్‌ చేయాలని శివాజీ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. టీవీ9 కొనుగోలు డీల్ నిలిపి వేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం తోసిపుచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఈ కేసులోనూ ఆయనకు భంగపాటు తప్పలేదు. తాను కూడా టీవీ9లో భాగస్వామినేనని చెబుతూ వస్తున్న శివాజీ.. ఎలాంటి ఆధారాలు చూపించకుండా కోర్టును తప్పుదోవ పట్టించాడంటూ ఇంప్లీడ్ పిటిషన్‌ను తిరస్కరించింది.
లోగో 99 వేలకు అమ్ముకున్నారు : విజయసాయి
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వామ్మో, రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. టీవీ9 చానల్ లోగోలను రూ.99 వేలకే తన మోజో టీవీకి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ పరిణామంతో కార్పొరేట్ రంగం దిగ్ఘ్రాంతికి గురైందని విజయసాయి ట్వీట్ చేశారు. క్రీస్తు శకం 193వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ ను సొంత సైన్యమే చంపేసిందని, ఆపై సామ్రాజాన్ని వేలంలో అమ్మేశారని ఆయన వివరించారు. ఇప్పుడు రవిప్రకాశ్ చేసిన పని కూడా అలాగే ఉందని పేర్కొన్నారు.

Related Posts