YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

పెళ్లి చేసుకుంటానంటూ దోచేశాడు

పెళ్లి  చేసుకుంటానంటూ దోచేశాడు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో 

నేటి టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలామంది సైబర్ నేరస్థుల చేతిలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మాట్రిమోని వెబ్‌సైట్లో ప్రొఫైల్ అప్‌డేట్ చేసిన ఒడిశా యువతికి సైబర్ నేరగాడు ఝలక్ ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి ఏకంగా రూ.6లక్షలకు పైగా దోచేశాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. కొద్దినెలలకే భర్తతో విడిపోవడంతో అక్కడ ఉండటం ఇష్టంలేక మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ‘ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటావ్.. మళ్లీ పెళ్లి చేసుకో’ అంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తేవడంతో తన ప్రొఫైల్‌ను భారత్ మాట్రిమోని వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. నెలరోజుల క్రితం యష్ సలుజా పేరుతో ఓ యువకుడు ఆమెకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడిని పూర్తిగా నమ్మేసింది. తన తల్లి రెండేళ్ల క్రితం చనిపోతూ మలేసియా బ్యాంకులో 200 కోట్ల డాలర్ల నగదు( రూ.14వేల కోట్లు) డిపాజిట్‌ చేసిందని, ఆ డబ్బు తన ఖాతాల్లోకి వేయించుకునేందుకు మలేసియా వెళ్తున్నానని, ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాం అంటూ చెప్పాడు. ఈ నెల 9న యువతికి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు రూ.14వేల కోట్లు తన ఖాతాలోకి రావాలంటే రూ.15లక్షలు చెల్లించాలని , తన స్నేహితుడు రూ.10లక్షలు ఇస్తానన్నాడని, ఇంకా సొమ్ము తక్కువ కావడంతో రూ.2లక్షలు ఇవ్వాలని అడిగాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు రూ.2లక్షల నగదు అతడి ఖాతాలో జమచేసింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి మరో రూ.2లక్షలు కావాలని అడగ్గా ఇచ్చింది. మే 14న మరోసారి ఫోన్ చేసి రూ.2లక్షలు అర్జెంట్‌గా కావాలని.. తిరిగి మూడు గంటల్లోనే ఇచ్చేస్తానని చెప్పాడు. తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బంగారు ఆభరణాలు కుదువపెట్టి డబ్బు ఇచ్చింది. తన దగ్గర చిల్లిగవ్వ మిగలకపోవడంతో మూడు గంటల తర్వాత ఎంతోకొంత నగదు పంపించాలని కోరింది. అయితే తనకు ఇంకా రూ.3లక్షలు కావాలని అతడు కోరడంతో మోసపోయానని గ్రహించింది. నేరుగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Related Posts