
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కారుకు దారివ్వలేదన్న కోపంతో కానిస్టేబుల్ యూనిఫాం విప్పించిన జడ్జిపై బదిలీ వేటు పడింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న హైకోర్టు జడ్జిపై బదిలీ వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం డ్రైవర్ కానిస్టేబుల్ ఘరేలాల్ ఇద్దరు విచారణ ఖైదీలను, ముగ్గురు కానిస్టేబుళ్లను పోలీసు వ్యానులో ఎక్కించుకుని కోర్టుకు బయలుదేరాడు. మరో వంద మీటర్లు ప్రయాణిస్తే వ్యాను కోర్టుకు చేరుకుంటుందనగా వెనక జడ్జి కారు వచ్చింది. జడ్జి కారు దారి కోసం హారన్ మోగించినప్పటికీ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వ్యాను డ్రైవర్ ఘరేలాల్కు దారివ్వడం సాధ్యం కాలేదు. అనంతరం కోర్టుకు చేరుకున్న జడ్జి ఘరేలాల్ను తన గదికి పిలిచి దారివ్వనందుకు చీవాట్లు పెట్టారు. ఆయన యూనిఫాం, బెల్టు విప్పించి అరగంటపాటు నిల్చోబెట్టి అవమానించారు. 38 ఏళ్లుగా సర్వీసులో ఉన్న 58 ఏళ్ల ఘరేలాల్ తనకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేకపోయారు. వెంటనే ఆగ్రా పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ బబ్లూ కుమార్ను కలిసి రాజీనామా సమర్పించారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయనకు వివరించిన ఘరేలాల్ స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు.