YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అలిపిరి పేలుడు సూత్రదారి నంబాల హతం.?

అలిపిరి పేలుడు సూత్రదారి నంబాల హతం.?

హైదరాబాద్
టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై 20 ఏళ్ల క్రితం తిరుపతి సమీపంలోని అలిపిరిలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. మనం ఇప్పుడు మావోయిస్టులుగా పిలుచుకుంటున్న నాటి నక్సలైట్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అప్పటికే 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన బాబు. ఆ తర్వాత అప్రహతిహాతంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీకి మరోమారు సీఎంగా పనిచేస్తున్నారు.
నాడు కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళుతున్న చంద్రబాబుపై నక్సలైట్లు క్లెమోర్ మైన్లు పెట్టి పేల్చారు. ఈ దాడికి నాటి నక్సల్స్ ఉద్యమంలో గెరిల్లా పోరాటానికి నాందీ పలికిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న తాజాగా బుధవారం ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైపోయాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల, వరంగల్ లోని ఇప్పటి ఎన్ఐటీ నాటి ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివి ఆ తర్వాత నేరుగా నక్సల్స్ ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంట్రీ ఇవ్వడంతోనే గెరిల్లా పోరాటాలకు తెర లేపిన నంబాల కీలక రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సాగాడు.
దండ కారణ్యంలో కీలక భూమిక పోషించిన నంబాల, మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మావోయిస్టులను సమూలంగా ఏరివేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే మావోయిస్టులకు పెద్ద ఎత్తున దెబ్బలు తగలగా, తాజాగా బుధవారం చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో నంబాల కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
చంద్రబాబు పై హత్యాయత్నంతో పాటుగా బలిమెల వంటి కీలక ఆపరేషన్లు కూడా నంబాల నేతృత్వంలోనే జరిగినట్లు సమాచారం. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖ జిల్లా పరిధిలో నాటి టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమలను కూడా మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యలకు కూడా నంబాలనే వ్యూహకర్తగా వ్యవహరించారట. మావోయిస్టుల ప్రస్థానంలో కీలక భూమిక పోషించడంతో పాటుగా నక్సల్స్ పేరును మావోయిస్టులు గా మార్చే ప్రక్రియలోనూ నంబాలది కీలక భూమికే. నంబాలపై రూ.1.5 కోట్ల మేర రివార్డు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Related Posts