ఎగువ పులిచింతల నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తారు. మంగళవారం ఉదయానికి బ్యారేజీలో పది అడుగుల నీటి మట్టం ఉంది. తొలుత అనుకోని విధంగా వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల లంకగ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 2.5 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద కారణంగా పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీకి 1998, 2000 సంవత్సరాల్లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు, సోమవారం రాత్రి సమయానికి నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వసామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.94 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి పులిచింతలలోకి 4.46 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా..17 గేట్లద్వారా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగే కొద్దీ.. ముంపు ప్రాంతాలు జలదిగ్బంధమవుతున్నాయి. గోపాలపురం, బోధన్, చిట్యాల తండా, కొల్లూరు, పులిచింతల గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు.