YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మజ్లీస్ కు కేసీఆర్ భయపడుతున్నారు...

మజ్లీస్ కు కేసీఆర్ భయపడుతున్నారు...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏ విధంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొంటారో, అదే మాదిరిగా సెప్టెంబర్ 17న కూడా జెండా ఎగురవేయాలని సూచించారు. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ మాటలే చెబుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో రైతులకు సాగు నీరందిన దాఖలు లేవని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు సుమారు 115 కి.మీ. పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరు అందించారని దత్తాత్రేయ ప్రశ్నించారు. ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని ఆరోపించారు. గత నెల రోజులుగా తరచూ ప్రాజెక్టులో మోటార్ల వెట్‌రన్ విజయవంతమైందని చెబుతున్నారు తప్ప రైతులు లాభపడింది లేదన్నారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సాగు చేసిన పంటలకు నీరు అందక ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం లక్ష్మీపూర్ పంప్ హౌజ్ నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించి, ఆయకట్టు నీరు అందిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు సంబంధించి రాచపుండు లాంటి సమస్యకు ఆర్టికల్ 370 రద్దుతో పరిష్కారం లభించిందని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆర్టికల్ 370పై అవగాహన లేక ఈ అంశాన్ని మతంతో ముడి పెడుతున్నారని విమర్శించారు. దేశానికి హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం 370 రద్దును హిందూ ముస్లిం సమస్యగా పేర్కొనడం విచారకరం అని వ్యాఖ్యానించారు. బీజేపీ మొదటి నుంచి ఆర్టికల్ 370 రద్దుకు కట్టుబడి ఉందనీ, ఆ మేరకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కశ్మీర్ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.

Related Posts