
న్యూఢిల్లీ, జూలై 15
భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. వీరు అంతరిక్షంలో 18 రోజులు గడిపిన అనంతరం 22 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి భూమిపై దిగారు.కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక దిగింది. వారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు వారు భూమిని చేరారు.జూన్ 25న అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు బృందం అక్కడ పలు కీలక పరిశోధనలు నిర్వహించింది. ఈ 18 రోజుల్లో వీరు దాదాపు 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. శుభాంశు శుక్లా 60కి పైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. అంతరిక్షంలో ఉన్న సమయంలో ఈ బృందం 230 సూర్యోదయాలను చూసింది.
స్వాగతించే వారిలో నేనే ఫస్ట్
యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌక కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో దిగింది. ఈ సందర్భంగా మోదీ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను స్వాగతించే భారత ప్రజల్లో తాను కూడా ఒకడినని ఆయన పేర్కొన్నారు. శుభాంశు శుక్లా తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చారని ప్రశంసించారు. ఇది భారత మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్యాన్ దిశగా మరో ముందడుగు అని ఆయన అభివర్ణించారు.