YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కిషన్ రెడ్డి బాటలో సబితా

కిషన్ రెడ్డి బాటలో సబితా

కిషన్ రెడ్డి బాటలో సబితా
హైద్రాబాద్, సెప్టెంబర్ 11  
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. తన మంత్రి వర్గంలో తాజాగా మరో ఆరుగురికి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్టుగానే కేటీఆర్, హరీశ్ రావులకు చోటు దక్కింది. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా తన కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. అందులో ఒకరు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ ఆమెకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు.అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆమె గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి బాటలోనే నడిచారు. మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరారు. లేదంటే వారే స్వయంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించాలని సూచించారు. శుభాకాంక్షల పేరుతో వృథా ఖర్చు చేయకుండా ఆ డబ్బులను సీఎం సహాయనిధికి ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు.మంత్రిగా 
బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డికి మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి పీఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రాసిన ‘ఉజ్వల ప్రస్థానం’ పుస్తకం కాపీని మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర, రాజవంశాలు, ఉద్యమం, ప్రగతి తదితర అంశాలకు సంబంధించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతికి సంబంధించిన విషయాలన్ని ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. దీనికోసం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చొరవ చూపాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని లైబ్రరీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి, మరిన్ని పుస్తకాలు సేకరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పుస్తకాలు స్వీకరించిన కిషన్ రెడ్డి..గత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనను అభినందించేందుకు వచ్చే మిత్రులు, కార్యకర్తలు ఎవరూ పుష్పగుచ్ఛాలు, పూలదండలు, శాలువాలు తీసుకురావొవ్దని, వాటికి బదులు నోటు పుస్తకాలు తీసుకురావాలని కోరారు. అప్పట్లో ఆయన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది.ఆయనను అభినందించేందుకు వచ్చిన వారు నోటు పుస్తకాలు బహూకరించారు. అలా ప్రతి ఒక్కరు పుస్తకాలు తీసుకురావడంతో ఓ గది నిండిపోయింది. పుస్తకాలను తీసుకొచ్చిన అందరికీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. తాజగా సబితా ఇంద్రారెడ్డి కూడా అదే బాటలో నడవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

Related Posts