YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 జగన్ కు తలనొప్పగా మారిన బాబాయి కేసు

 జగన్ కు తలనొప్పగా మారిన బాబాయి కేసు

 జగన్ కు తలనొప్పగా మారిన బాబాయి కేసు
కడప,సెప్టెంబర్ 14,
వైఎస్ జగన్ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొనేది ఈ ఒక్క విషయంలోనే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు ఏడు నెలలు కావస్తోంది. మార్చి నెలలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటికీ ఇప్పటి వరకూ హంతకులు ఎవరో తేలలేదు? హత్యకు దారి తీసిన కారణాలేంటో? స్పష్టం కాలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అయితే వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కారు. కానీ సొంత బాబాయి హత్య విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేక పోతుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేశారు. తొలుత బాత్ రూంలో కాలు జారి పడి గుండెపోటుతో మరణించారని భావించినప్పటికీ వివేకానందరెడ్డి శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉండటంతో హత్యగా నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదిక కూడా అదే చెప్పింది. వివేకానందరెడ్డిది సహజమరణం కాదని తేలడంతో అసలు హత్య ఎవరు చేశారు? సౌమ్యుడైన వివేకానందరెడ్డికి శత్రువులు ఎవరున్నారు? సొంతగడ్డ పులివెందులలో వివేకాను హత్య చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తాయి.వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసులో మరో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేశారు. మొత్తం 1300 మందిని ఈ కేసులో అనుమానితులుగా భావించి విచారించారు. ఇందులో ముగ్గురికి నార్కో అనాలిసిస్ టెస్ట్ లను చేశారు. వాచ్ మెన్ రంగయ్య, గంగిరెడ్డి, శేఖర్ లను అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. అయినా ఒక్క క్లూ కూడా లభ్యం కాలేదని తెలుస్తోంది. పోలీసులకు కూడా ఈ కేసు అంతుచిక్కకుండా ఉంది.ఇటీవల వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమం కోసం పులివెందుల వెళ్లినప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వివేకా సతీమణి ఒకింత జగన్ పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికీ ఎవరు చంపారో తెలియకుంటే ఎలా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతోనే జగన్ డీజీపీకి సీరియస్ గా క్లాస్ పీకడంతో ఆయన హుటాహుటిన పులివెందుల వెళ్లారు. అయితే బాబాయి హత్య కేసును జగన్ లైట్ గా తీసుకున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి కూడా వస్తున్నాయి. సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తం జగన్ ప్రభుత్వం వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీని ఛేదించకుంటే విమర్శలు పాలు కావడం ఖాయం.

Related Posts