Highlights
- మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్
- ఉ.11 గంటలకు ప్రవేశపెట్టనున్న మంత్రి ఈటెల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ఈటల గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నా రు. ఈ బడ్జెట్ కు బుధవారం రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసారి బడ్జెట్ రూ.1.78 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా. గత బడ్జెట్తో పోలిస్తే ఇది 15%-19% పెరిగే అవకాశం ఉంది. కొత్త బడ్జెట్లో పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి కొత్త పథకాలు ఉండనున్నాయి. ప్రజలందరికీ ఆరోగ్య కార్డుల్ని జారీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధిని కేటాయించే అవకాశముంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం అమలవుతున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 15% అదనంగా కేటాయింపులు పెరగనున్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్రాన్ని పురోగామి దిశగా తీసుకెళ్లేలా రూపకల్పన చేసింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. వాటికీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వీటిలో ఒకటి పంచాయతీరాజ్ బిల్లు. పరోక్ష ఎన్నికలకే పచ్చజెండా ఊపుతూ ఇది తయారైనట్లు సమాచారం. ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ మరో బిల్లును రూపొందించింది. పురపాలక శాఖకు సంబంధించి మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.