YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అందుబాటులోకి రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక  కీలక నిర్ణయాలకు కేబినెట్ ఓకే

అందుబాటులోకి రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక  కీలక నిర్ణయాలకు కేబినెట్ ఓకే

అందుబాటులోకి రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక 
కీలక నిర్ణయాలకు కేబినెట్ ఓకే
విజయవాడ, నవంబర్ 13, 
ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలన్నింటిలోను ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నమే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు మొదలుపెట్టారు.ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధనకు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వివరించారు. కమిటీ సూచనలు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకే ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలని నిర్ణయించామని, అయితే, తప్పనిసరిగా మాతృభాష ‘తెలుగు’ ఒక సబ్జెక్టుగా ఉంటుందని వివరించారు.ఇసుక నిల్వ చేసి, దాన్ని విక్రయించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. రోజూ రెండు లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని, పది రోజుల్లో డిమాండ్ కు తగ్గట్టుగా ఇసుకను సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని, ఆడిట్ నిర్వహిస్తామని, ఏపీ పర్యావరణ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షలు అందజేస్తామని, సోలార్, పవన విద్యుత్ పాలసీలకు సవరణలు, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టానికి సవరణలు చేయాలని, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు, ఎనిమిది ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.

Related Posts