YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కనిగిరిలో కరువైన మానవత్వం

కనిగిరిలో కరువైన మానవత్వం

కనిగిరిలో కరువైన మానవత్వం
ఒం గోలు, నవంబర్ 21
తనను కని పెంచి పెద్దచేసిన తల్లి కేన్సర్‌ బారినపడటంతో ఓ కొడుకు తల్లడిల్లిపోయాడు. ఆమెను ఎలాగైన కాపాడుకోవాలని తపించిన ఆ కుమారుడు వైద్యం కోసం లక్షలు ఖర్చుచేశాడు. అయినా బాగుపడకపోవడంతో చివరి ఘడియాల్లో రెండు రోజులు తన చేతులపై మోసుకుంటూ పలుచోట్లకు తిరిగాడు. మృత్యువుకు సమీపంలో ఉన్న ఆమెను ఇక్కడ ఉంచొద్దంటూ మానవత్వంలేని మనుషులు తరిమేశారు. చివరకు పార్కులోనే టెంట్ వేసి తల్లిని ఉంచాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, వెంకటలక్ష్మి దంపతులు తమ కుమారుడు సతీష్‌తో కలిసి గత మూడేళ్ల నుంచి పామూరులో నివాసం ఉంటున్నారు.కుమారుడు సతీష్ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట వెంకటలక్ష్మిక్యాన్సర్‌ బారిన పడింది. దీంతో ఆమెను వైద్యం కోసం పలు హాస్పిటల్స్‌లో తిప్పి, రూ.4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. అయినా వెంకటలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడకపోగా క్షీణించింది. దీంతో నవంబరు 18న పామూరులోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, రిమ్స్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అక్కడ నుంచి వెంకటలక్ష్మిని తాము అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొస్తుండగా ఆ ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేశాడు. తమ ఇంటికి తీసుకురావొద్దని సతీష్‌ను హెచ్చరించాడు.గత్యంతరం లేక సతీష్‌ తన తల్లిని తిరిగి స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, అక్కడ ఉంచడం కుదరదని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో ఆ రోజు రాత్రి పంచాయతీ ఆఫీసులోని చెత్త రీసైక్లింగ్ యూనిట్‌లో తలదాచుకున్నారు. మర్నాడు ఉదయం సిబ్బంది వచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారు. దిక్కుతోచని స్థితిలో తల్లిని చేతులతో మోసుకుంటూ సమీపంలోని డీవీ పార్కుకు తీసుకెళ్లి టెంట్‌ వేసుకుని రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో వెంకటలక్ష్మిని పామూరు హాస్పిటల్‌లో చేర్చుకోవాలని వైద్యాధికారికి సూచించారు. అధికారుల ఆదేశాలతో ఆమెను హాస్పిటల్‌లో చేర్చుకున్నా చికిత్స పొందుతూ వెంకటలక్ష్మి బుధవారం కన్నుమూసింది.ఇంత కష్టంలో ఉన్నా స్నేహితులు, బంధువులు సహా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని, తమను పట్టించుకున్న నాథులు లేరని సతీష్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పామూరు శ్మశాన వాటికలో అశ్రునయనాలతో అమ్మకు అంత్యక్రియలు నిర్వహించాడు.

Related Posts