Highlights
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి
* మొదటి దశలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాష
* ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది ఉండొద్దనే పదోతరగతి వరకే పరిమితం
* అమలు విధానంపై అధ్యయనం చేస్తున్నాం
* శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మొదట్లో ఇంటర్ వరకు దీనిని అమలు చేయాలని భావించినా...ఇంటర్ విద్యార్థులకున్న వివిధ స్థాయిల నేపథ్యంలో వారికి ఇబ్బందులు కలిగించకూడదనే మొదటి దశలో పదో తరగతి వరకు అమలు చేస్తున్నామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్ రెడ్డి, నారదాసు, పూల రవీందర్ రెడ్డి, కాటెపల్లి జనార్ధన్ రెడ్డి సభ్యులు మాతృ భాష అమలు పై అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమాధానం చెప్పారు.
తెలుగు భాషను రానున్న విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటన చేశారని చెప్పారు. తెలుగుకు పునఃవైభవం తీసుకురావాలని సిఎం కేసిఆర్ చెప్పారని, సిఎం ఆదేశాల మేరకు తెలుగు తప్పనిసరి చేయడంపై కమిటీ వేశామన్నారు. ఈ కమిటి వివిధ రాష్ట్రాల్లో తిరిగి అక్కడ మాతృ భాష అమలు విధానాన్ని అధ్యయనం చేసిందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం అనంతరం నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ కు సమర్పించామన్నారు. తాజాగా నిన్న కూడా ఈ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి కేసిఆర్ సమావేశమై 10 వ తరగతి వరకు తెలుగు భాష తప్పనిసరిగా అమలు చేయాలని ప్రకటించారన్నారు. పదో తరగతి వరకు రాష్ట్ర సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ పాఠశాలల్లో దీనిని ఏ విధంగా అమలు చేయాలని ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.