
కామాంధుల దాష్టీకం.. గర్భం దాల్చింన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని
కొరాపుట్
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒడిస్సా లోని కొరాపుట్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. సేవాశ్రమ పాఠశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు రక్షణగా ఉండాల్సిన వారే భక్షకులుగా మారారు. దీంతో కామాంధుల దాష్టీకానికి బలైన ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చింది. బాలికను పరీక్షించిన డాక్టర్లు మూడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ విషాద సంఘటన జయపురం సబ్డివిజన్ పుంపుణి గ్రామంలో గల సేవాశ్రమ పాఠశాలలో జరిగింది. ఈ విషయం బయటకు పొక్కగానే సంబంధిత అధికారుల్లో కదలిక ప్రారంభమైంది. ఆ విద్యార్థిని ఎవరి వల్ల గర్భం దాల్చిందన్నది స్పష్టం కాకపోయినా ఆశ్రమ పాఠశాల ప్రధాన అధ్యాపకురాలి భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిçస్తున్నారు. మూడు రోజుల కిందట ఆ పాఠశాలలో ఒక విద్యార్థిని గర్భవతి అయిందన్న విషయం పాఠశాల అధికారుల దృష్టికి వచ్చింది. అయితే ఆ విషయాన్ని మరుగు పరిచేందుకు బయటకు పొక్కనివ్వలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత దాచి పెడదామన్నా పాఠశాల విద్యార్థిని గర్భిణి అయిందన్న విషయం బయటకు పొక్కింది. దీంతో ఈ విషయం ప్రజలలో చర్చనీయాంశంగా మారడంతో జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీఓ తక్షణమే దృష్టి సారించి సేవాశ్రమ పాఠశాలకు వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆ బాలిక మూడు నెలులగా శానిటరీ నేప్కిన్స్ తీసుకువెళ్లడం లేదని రికార్డులు పరిశీలించి తెలుసుకున్నారు. వెంటనే వారు ఆ విద్యార్థినిని జయపురంలోని ఫుల్బెడలో గల కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఆ బాలికను పరీక్షించిన డాక్టర్ ఆమె మూడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. దీంతో ఆ విషయం ఆశ్రమ పాఠశాల గోడలు దాటి బయటకు పొక్కింది. విద్యార్థిని గర్భిణి అయిందన్న విషయం తెలిసిన ఉన్నతాధికారులు కంగుతిన్నారు. వెంటనే జయపురం సమగ్ర గిరిజనాభివృద్ది ప్రాజెక్టు అధికారి గోపీనాథ్ సరక, కొరాపుట్ జిల్లా శిశు సురక్షా అధికారి శుభశ్రీ దాస్, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు గాయత్రి దేవి తదితరులు సేవాశ్రమ పాఠశాలకు వెళ్లారు. ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు గర్భిణి అన్న విషయం నిర్ధారణ చేసుకునేందుకు మరోసారి ఆ విద్యార్థినిని హాస్పిటల్కు తీసుకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఆమె గర్భవతి అని మరోసారి డాక్టర్లు నిర్ధారించడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సేవాశ్రమ పాఠశాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాల, హాస్టల్ సిబ్బంది, గర్భం దాల్చిన విద్యార్థిని, సహచర విద్యార్థినులను విచారణ చేశారు. అనంతరం పోలీసులు ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుఖాంతి రథ్ భర్తను, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.