పోలవరంపై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ, జనవరి 14
పోలవరం ప్రాజెక్టుపై ఒడిషా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్టేటస్ రిపోర్టు, నిర్మాణ చిత్రాలతో పూర్తి సమాచారాన్ని అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని ఒడిషా వాదనలు వినిపించింది. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని ఒడిషా తరఫు న్యాయవాది.. వాదనలు వినిపించారు.ప్రాజెక్టు నిర్మాణంపై తమకెలాంటి అభ్యంతరం లేదని.. అయితే మణుగూరు ప్లాంటు, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టు యధావిధిగానే కొనసాగుతుందని ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒడిస్సా, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని ఏపీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.