పుల్వామా వీరులకు నివాళులు
- సీఆర్పీఎఫ్ ఐజీ ఆఫీసులో అమర జవాన్ల కుటుంబాలకు సన్మానం
ఖమ్మం, ఫిబ్రవరి14
ఏడాది క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లకు గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నివాళులు అర్పించారు. సీ ఆర్ పీ ఆఫ్ ఉన్నతాధికారుల ఆహ్వానం మేరకు హైదరాబాద్ లోని ఆ విభాగపు ఐజీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అమర జవాన్ల సంస్మరణ సభకు గాయత్రి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి స్మ్రుతి చిహ్నం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల తో కలిసి ఆయన పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం 81 వసంతాల సీఆర్పీఎఫ్ పయనం పై రూపొందించిన సావనీర్ ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పుల్వామా ఘటనలో అమరులైన తెలుగు రాష్ట్రాల జవాన్ల కుటుంబీకులను గాయత్రి రవి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల ను స్మరించుకునే వేడుకకు హాజరవడం గర్వంగా ఉందన్నారు. ఇప్పటిదాకా వివిధ ఘటనల్లో సుమారు 2 వేల మంది జవాన్ల ను కోల్పోయినా సీఆర్పీఎఫ్ సంస్థ దేశం కోసం సాహొసోపేతమైన రక్షణ సేవలందిస్తోందని అన్నారు. ఇలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తోన్న జవాన్లకు ప్రణమిల్లి జేజేలు పలకుతున్నట్లు చెప్పారు. అమర జవాన్ల ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడు ఏదో ఒక రూపంలో తన దేశ భక్తిని చాటుకోవాలని గాయత్రి రవి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఐజీ రాములు నాయక్, సంబంధిత అధికారులు, అమర జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.