కరోనా భయంతో అంత్యక్రియలను అడ్డుకున్నారు
పెద్దపల్లి మార్చ్ 26
కరోనా వైరస్ ధాటికి అన్ని దేశాలు విలవిల్లాడుతున్నాయి. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా మహమ్మారి సృష్టిస్తున్న భయోత్పాతానికి పల్లెల్లో అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని దుస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సీతంపేట గ్రామానికి చెందిన రాజయ్య మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో సింగరేణిలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతని తల్లి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు స్వగ్రామానికి తీసుకువచ్చారు. వీరిని గ్రామంలోకి రాకుండా పొలిమేరల్లోనే గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించొద్దని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మరణ ధ్రువీకరణ పత్రం పరీశీలించి పక్షవాతంతో చనిపోయినట్లు నిర్ధారించారు. అయినా, దహన సంస్కారాలు పూర్తి చేసి గృహ నిర్బంధంలో ఉండాల్సి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ సొంత భూమిలో కార్యక్రమం నిర్వహించి వెళ్లిపోతామని రాజయ్య చెప్పడంతో... స్థానికులు అంగీకరించారు. వచ్చిన బంధువులే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు