కొత్తగా పరిశ్రమలు ప్రారంభించేవారికి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిలో భాగంగా అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల అనుమతులను మంజూరు పారదర్శకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే టీఎస్ఐపాస్ (తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం) రూపొందించి అమలు చేస్తోంది. ఇక ఔత్సాహికుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) వేగంగా, పారదర్శకంగా పరిశీలించి మంజూరు చేసింది. దీనికి గాను ఎన్పీడీసీఎల్కు సర్కార్ ఉత్తమ టీఎస్ఐపాస్ సేవల పురస్కారం సైతం అందజేసింది. ఇదంతా బాగానే ఉన్నా ఇటీవల టీఎస్ఐపాస్లో హెచ్టీ కనెక్షన్ల మంజూరులో అవకతవకలు సాగినట్లు వార్తలొస్తున్నాయి. కొందరు ఎన్పీడీసీఎల్ అధికారుల పనితీరుపై అనుమానాలు ముసురుకున్నాయి. దీంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ చేసింది. డిస్కం పరిధిలో 98 శాతం దరఖాస్తులకు పారదర్శకంగానే కనెక్షన్లు మంజూరు చేయగా దర్యాప్తులో తేలింది. అయితే కొన్ని చోట్ల పలువురు ఇంజినీర్లు, వోఅండ్ఎం సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
హెటీ కనెక్షన్ల మంజూరులో అవకతవకలను సీఎండీ సీరియస్గా తీసుకున్నారు. నలుగురు ఏఈలు, ముగ్గురు వోఅండ్ఎం సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. వరంగల్ సర్కిల్లో ఇద్దరు ఏఈలు, పూర్వపు కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఏఈలపైనా వేటు వేశారు. ఈ అంశంపై ఏఈలతోపాటు ఇంకా ఎవరెవరి హస్తముందనే దానిపై ఆరా తీసేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ఐపాస్ పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించిన వారిపై కొరడా ఝుళిపించేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా పరిశ్రమలు అభివృద్ధి పరచి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవకతవకలు, అవినీతికి చోటు లేకుండా అర్హులకే అనుమతులు లభించేలా చూడాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు వ్యవహరించడంతో ఈ ఉదంతాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడడంలేదు.