కాకినాడ జూలై 4
యువ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఆదర్శంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని, ప్రతిపక్షంతో సహా ప్రతిఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వంగా గీత పిలుపునిచ్చారు. స్థానిక డి.కన్వెన్షన్ హాలునందు శనివారం వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ ఎంతో దూరదృష్టితో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తే ప్రతిపక్షాలు దానిని రాజకీయం చేయడం తగదని అన్నారు. అమరావతి లో నిజమైన రైతులు ఎవరూ లేరని, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని ఉద్యమం చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమం సరైన విధానం కాదని ప్రజలు గ్రహించారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంవత్సర కాల పరిపాలనలో మేనిఫెస్టోలో అంశాలన్నీ అమలుచేశారని తెలిపారు. రాజకీయ కారణాలతో ఉద్యమాలు తగవని హితవు పలికారు. పేదల సొంతింటి కల ఇళ్ల స్థలాలు పంపిణీ కూడా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని, ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని అన్నారు. కాకినాడలో దాదాపు 32 వేల మంది లబ్ధిదారులలో కొమరగిరి ప్రాంతంలో కొంతమందికి, యానాం రోడ్డు లోని ప్రభుత్వ భూమిలో కొంతమందికి ఇంటిస్థలాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.