అదిలాబాద్, ఆగస్టు 8,
కమలంలో కోల్డ్ వార్ మొదలైంది.. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డిల మధ్య వివాదం రాజుకుంటోంది. ఇన్ని రోజుల పాటు పార్టీలో స్తబ్ధంగా ఉన్న ఆమె రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. గతంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించిన సుహాసిని రెడ్డి మరింత ఉన్నత పదవులు చేపట్టేందుకు ఇప్పటినుంచే పార్టీలో పట్టు సాధించడం ద్వారా తన ఉనికిని గట్టిగా చాటుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించిన సుహాసినిరెడ్డి గడిచిన శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ టిక్కెట్ సాధించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకుల వద్ద ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నుంచి పాయల శంకర్కే మరోసారి టిక్కెట్ దక్కింది. అయినప్పటికీ ఎక్కడ నిరాశ నిస్పృహలు కనిపించకుండా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మినహా మరే ఎన్నికలు లేనందునా సుహాసిని రెడ్డి తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. పాయల శంకర్తో విభేదాలు ఉన్నప్పటికీ అవి ఎక్కడ కానరానివ్వకుండా అంతా సఖ్యతగా ఉన్నట్టుగా వ్యవహారం నడుపుతూ వస్తున్నారు.ఆది నుంచి ఈ ఇరువురు నేతలు తమ మధ్య సఖ్యత ఉన్నట్టు బయటకు ప్రదర్శిస్తున్నప్పటికీ మండలాల్లో తమ తమ వర్గాలను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో తనకంటూ పార్టీలో ఒక ప్రత్యేకత సాధించకపోతే ముందుకు పోలేమన్న అభిప్రాయం సుహాసిని వర్గంలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆమె కొంత పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచడం కనిపిస్తోంది. తాజాగా ఇటీవల ఆమె దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్లను కలవడం పార్టీలో విస్తృత చర్చకు దారి తీసింది. రాష్ట్ర, జాతీయ నేతలను కలిసి జిల్లా సమస్యలను చర్చించడం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా ఉన్నతి కోసం ఆమె తన ప్రయత్నాలను మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుహాసిని రెడ్డి పార్టీ కార్యక్రమాల పరంగా కూడా కొంతమంది తీరుపై బాహాటంగానే ఎండగడుతున్నారు. గతంలో జిల్లాలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు జిల్లా నేత పార్టీ సిద్ధాంతాల ప్రకారం దూకుడుగా వ్యవహరించకుండా మిన్నకుండటంపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి సమయంలో సుహాసిని రెడ్డి ముందుండడం ద్వారా పార్టీ కార్యకర్తల మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు